ఓ మాజీ సీఎం అలా మాట్లాడతారా?: మోడీ కాశీ పర్యటనపై అఖిలేష్ వ్యాఖ్యలనుద్దేశించి అనురాగ్
న్యూఢిల్లీ: వారణాసి(కాశీ)లో రెండు రోజులపాటు పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఆఖరి గడియలు సమీపించినప్పుడే ఎవరైనా కాశీకి వచ్చి బస చేస్తారు అని అఖిలేష్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్.. అఖిలేష్ యాదవ్పై తీవ్రంగా స్పందించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి నుంచి అలాంటి భాషను తాను ఊహించలేదని చురకలంటించారు. తనకంటే పెద్ద వారి పట్ల అలాంటి పదజాలం వాడటం దురదృష్టకరమన్నారు. అఖిలేష్ వ్యాఖ్యలు కాశీ, రామ మందిరం పట్ల సమాజ్ వాదీ పార్టీకి ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తున్నాయని అన్నారు.

ఎవరైనా అలాంటి మాటలు అనేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ హితవు పలికారు. అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు ఆయన మనస్తత్వాన్ని, పెంపకాన్ని సూచిస్తున్నాయని చురకలంటించారు అనురాగ్ ఠాకూర్, ఎస్పీ నేతలు వాడుతున్న భాష వారిలో ఆందోళనకు అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు ఎంతో క్రూరంగా ఉన్నాయంటూ బీజేపీ నేతలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో అఖిలేష్ ను పోల్చి దుయ్యబట్టారు. క్రూరమైన, అనాగరికమైన వ్యాఖ్యలు అఖిలేష్ యాదవ్ మనస్తత్వాన్ని చాటుతున్నాయంటూ కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. అయితే, నలువైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో సమాజ్ వాదీ పార్టీ తమ అధినేత వ్యాఖ్యలను సవరించే ప్రయత్నం చేసింది. అఖిలేష్ మాటల్ని బీజేపీ వక్రీకరిస్తోందని, ఆయన యూపీ ప్రభుత్వానికి చివరి రోజులు గురించి మాట్లాడారని చెప్పుకొచ్చింది. ఏ వ్యక్తిని ఉద్దేశించి అఖిలేష్ ఆ వ్యాఖ్యలు చేయలేదని ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌధరి తెలిపారు.
కాగా, ప్రధాని నరేంద్ర మోడీ గత రెండు రోజులుగా కాశీలో పర్యటించిన విషయం తెలిసిందే. కాశీలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ తన కలల ప్రాజెక్టు.. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ కారిడార్ను సోమవారం ప్రారంభించారు. మంత్రోచ్ఛారణలతో ఆలయంలో ప్రార్థనలు చేసిన మోడీ, ఆలయ నిర్మాణంలో పాల్గొన్న కార్మికులతో కలిసి భోజనం చేశారు.












Click it and Unblock the Notifications