‘పాక్, బంగ్లాదేశ్లో మైనార్టీలు ఏమవుతున్నారు?: నిరసనలు చేసినా సీఏఏ వెనక్కి తీసుకోం’
లక్నో: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలు కొనసాగించినా.. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సీఏఏను వెనక్కి తీసుకునేదే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. మంగళవారం లక్నోలో సీఏఏకి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.

ప్రతిపక్షాలకు సవాల్..
సీఏఏపై బహిరంగ చర్చకు సిద్ధమేనా? అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్లకు ఈ సందర్బంగా అమిత్ షా సవాల్ విసిరారు. సీఏఏ ద్వారా ఎవరి పౌరసత్వాన్ని రద్దు చేయడం జరగదని స్పస్టం చేశారు.

ఆందోళనలు చేసుకోండి.. మేం మాత్రం సీఏఏను వెనక్కి తీసుకోం
పౌరసత్వం ఇచ్చేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చామని, ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. ఆందోళనకారులకు తాను ఒకటే చెబుతున్నానని.. మీరు మీ ఆందోళనలు చేసుకోండి.. మేం మాత్రం సీఏఏని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని అమిత్ షా తేల్చి చెప్పారు.

పాక్ ఉగ్రవాదులు వచ్చి బాంబులేస్తుంటే..
సీఏఏపై దేశంలో ఎక్కడైనా బహిరంగ చర్చకు రండి.. అని విపక్షాలకు అమిత్ షా సవాల్ విసిరారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు ప్రతిపక్ష పార్టీల కళ్లను కప్పేశాయని విమర్శించారు. పాకిస్థాన్ నుంచి ఎన్నో ఏళ్లుగా అక్రమ వలసదారులు, ఉగ్రవాదులు వస్తూ ఇక్కడ బాంబులు పేలుస్తుంటే మౌనముని బాబా మన్మోహన్ సింగ్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు.

పాక్, బంగ్లాదేశ్లో మైనార్టీలు ఏమవుతున్నారు?
దేశ విభజన జరిగిన సమయంలో బంగ్లాదేశ్లో 30శాతం హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు ఉన్నారని, అదే సమయంలో పాకిస్థాన్లో వీరి జనాభా 23శాతం ఉందని.. కానీ. ఇప్పుడు బంగ్లాదేశ్లో 7శాతానికి, పాకిస్థాన్లో 3శాతానికి వారి జనాభా చేరుకుందని.. మరి మిగిలిన జనాభా ఎంత ఏమయ్యారని అమిత్ షా స్పందించారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నవారు దీనికి సమాధానం చెప్పాలన్నారు. కాగా, సీఏఏను వ్యతిరేకిస్తూ లక్నోలో ముస్లింలు గత వారం నుంచి ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో అక్కడే సీఏఏపై అవగాహన నిర్వహిస్తూ ఈ ర్యాలీని తలపెట్టింది బీజేపీ. అమిత్ షాతోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్యలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications