ఆక్సిజన్ కొరత: రాష్ట్రాలది ఓవరాక్షన్ -అన్నీ చేస్తున్నాం, సంచలనాలు వద్దు -ఢిల్లీ హైకోర్టులో కేంద్రం వాదన
దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరి, రోజువారీ కేసుల్లో ప్రపంచ రికార్డు, మరణాల్లో జాతీయ రికార్డు బద్దలైనవేళ, వివిధ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడి రోగులు విలవిల్లాడుతున్నారు. దేశరాజధాని ఢిల్లీలోని పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా అడుగంటిపోగా, ప్రఖ్యాత మ్యాక్స్ ఆస్పత్రి వేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు.. కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా సరోజ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సైతం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై గురువారం జరిగిన విచారణలో అనూహ్య వాదనలు చోటుచేసుకున్నాయి..

గంట దాటితే ఆక్సిజన్ బంద్..
ఢిల్లీలోని ప్రఖ్యాత సరోజ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి నగరంలో వివిధ బ్రాంచ్ లు ఉన్నాయి. అవన్నీ కొవిడ్ రోగులతో నిండిపోయాయి. కొన్ని బ్రాంచ్ లలో కేవలం గంటకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉంది. దీంతో ఆస్పత్రి యాజమాన్యం హుటాహుటిన హైకోర్టును ఆశ్రయించింది. మ్యాక్స్ ఆస్పత్రుల పిటిషన్ ను విచారించిన జస్టిస్ విపిన్ సంఘి , జస్టిస్ రేఖ పల్లి ధర్మాసనమే సరోజ్ ఆస్పత్రుల పిటిషన్ ను కూడా విచారించింది. ఢిల్లీ ప్రభుత్వం సైతం సరోజ్ ఆస్పత్రికి అనుకూలంగా వాదనలు వినిపించింది..

ఆక్సిజన్ ప్లాంట్లపై కేంద్రం దుర్మార్గం
''ఢిల్లీలోని దాదాపు అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు అడుగంటిపోయాయి. ఆక్సిజన్ కొతరపై మాకు ఎస్ఓఎస్ కాల్స్ వస్తున్నాయి. కోటా ప్రకారం మాకు రావాల్సిన ఆక్సిజన్ ఎప్పుడో దాటేసింది. అదనపు కేటాయింపుల కోసం కేంద్రాన్ని అభ్యర్థించాం. అయితే ప్లాంట్ల కేటాయింపులో కేంద్రం దుర్మార్గంగా వ్యవహరించింది.
ఎక్కడో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఉన్న ప్లాంట్ల నుంచి ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరా చేస్తామనడం దుర్మార్గం కాక మరేంటి? పక్కనే ఉన్న హర్యానా, యూపీలోని ప్లాంట్లు కూడా ఢిల్లీకి కేటాయించినప్పటికీ, అక్కడి స్థానిక ప్రభుత్వ అధికారులు ఆయా ప్లాంట్లను స్వాధీనం చేసుకుని, వారికి అవసరమయ్యే ఆక్సిజన్ తీసుకెళుతున్నారు..'' అని ఢిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. నిజానికి చాలా రాష్ట్రాలూ తమకు కేటాయించిన ఆక్సిజన్ ప్లాంటు దూరంగా ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కాగా,

సంచలనాలకు సమయం కాదిది..
ఢిల్లీ ప్రభుత్వం, సరోజ్ ఆస్పత్రుల వాదనతో విభేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈక్రమంలో రాష్ట్రాల వ్యవహార శైలిపై ఆయన అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ఆక్సిజన్ కొరత విషయంలో కొన్ని రాష్ట్రాలు ఉద్దేశపూర్వకంగా సంచలనాత్మక తీరును ప్రదర్శిస్తున్నాయని, ఆ వరుసలో ఢిల్లీ ప్రభుత్వం ముందుందని ఆక్షేపించారు.
ఆక్సిజన్ కొరత అప్పటికప్పుడు తీరేది కాదంటూనే, సరఫరాను పెంచడానికి అవసరమైన అన్ని చర్యలను కేంద్రం చేపట్టిందని, విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సరిపడా ఆక్సిజన్ ను అందజేస్తున్నామని కేంద్రం తరఫు న్యాయవాది తెలిపారు. కేంద్రం వర్సెస్ రాష్ట్రం అన్నట్లుగా వాదనలు సాగిన తీరును హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. వీలైనంత తొందరగా ఢిల్లీలోని ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా వేగవంతం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.












Click it and Unblock the Notifications