రోజుకు రూ.25వేల కోట్లు: త్వరలో 1000నోటు!, జనధన ఖాతాల్లోకి భారీగా సొమ్ము!
పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంక్ ఉపశమన చర్యలు చేపడుతోంది.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంక్ ఉపశమన చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే త్వరలో మార్కెట్లోకి కొత్త రూ.1000 నోట్లను తెచ్చేందుకు ఆర్బీఐ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది. రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్ల రూపంలో ఉన్న రూ.14.5లక్షల కోట్లలో ఇప్పటికే రూ.8లక్షల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయని కేంద్ర సహాయమంత్రి అర్జున్ మేఘ్వాల్ తెలిపారు.
అయితే, మార్కెట్లోకి కొత్త నోట్ల రూపంలో రూ.3.35లక్షల కోట్లు మాత్రమే ప్రవేశించాయని మేఘ్వాల్ చెప్పారు. ఈ అంతరాన్ని తగ్గించేందుకు రోజూ రూ.25,000 కోట్లను బ్యాంకుల ద్వారా ఆర్బీఐ మార్కెట్లోకి వదులుతోందని.. ఈ లెక్కన సాధారణ స్థితి ఏర్పడేందుకు దాదాపు 45 రోజులు పట్టే అవకాశాలున్నాయని ఆయన వివరించారు.
నోట్ల రద్దు, అసలు విషయం చెప్పిన మోడీ!
కాగా, సమస్యను మరింత త్వరగా తీర్చేందుకు సమీప భవిష్యత్తులోనే రూ.1000 నోట్లను తెచ్చేందుకు ఆర్బీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రూ.2000 నోట్లకు చిల్లర సంపాదించడం ప్రజలకు ఇబ్బందిగా మారుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయంవైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
జన్ధన్ ఖాతాల్లో భారీగా పెరిగిన డబ్బు
మరోవైపు జన్ధన్ ఖాతాల్లో నగదు ఒక్కసారిగా పెరగడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఈ ఖాతాల సంఖ్య 16.47 లక్షలు పెరగడం విశేషం. జన్ధన్ ఖాతాల్లో నల్లధనంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం.. మరోవైపు ప్రజలను ఖాతాలు తెరిచేందుకూ ప్రోత్సహిస్తోంది.
కాగా, ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి నవంబర్ 23వ తేదీ వరకు జన్ధన్ ఖాతాల్లోని నగదు 60 శాతం పెరిగింది. నవంబర్ 9 నాటికి జన్ధన్ ఖాతాల్లో ఉన్న మొత్తం రూ.45,637 కోట్లు కాగా.. 23వ తేదీకి ఆ మొత్తం రూ.72,835 కోట్లకు చేరుకుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జన్ధన్ ఖాతాలో సగటు మొత్తం రూ.1,750 కాగా.. 23వ తేదీకి అది రూ.2,837కు చేరుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని ఖాతాల్లో మొత్తాలు 56 శాతం పెరగగా.. ప్రైవేటు రంగంలో 66 శాతం పెరిగాయి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లోని ఖాతాల్లో మొత్తాలు 77 శాతం పెరగడం గమనార్హం. నవంబర్ 9 నాటికి 25.51 కోట్లుగా ఉన్న జన్ధన్ ఖాతాల సంఖ్య.. 23 నాటికి మరో 16.47లక్షలు పెరిగింది. సున్నా నిధులున్న జన్ధన్ ఖాతాల సంఖ్య 0.33 శాతం తగ్గడం విశేషం.