రేప్ లు, హత్యలు, సెంట్రల్ జైల్లో సైకో కిల్లర్ జైశంకర్ ఆత్మహత్య, రూ. 10 లక్షలు రివార్డు!
బెంగళూరు: రేప్ లు, సీరియల్ హత్యల కేసుల్లో అరెస్టు అయ్యి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సైకో కిల్లర్ జై శంకర్ అలియాస్ కిల్లర్ శంకర్ మంగళవారం వేకువ జామున ఆత్మహత్య చేసుకున్నాడు. బ్లేడ్ తో గొంతుకోసుకున్న జై శంకర్ కు చికిత్స చేయించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మరణించాడు. సైకో కిల్లర్ జై శంకర్ ను పట్టించిన వారికి రూ. 10 లక్షలు రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారంటే ఇతను ఎంతో దుర్మార్గుడో అర్థం చేసుకోవచ్చు.

చంపేసి రేప్ చేస్తాడు
తమిళనాడుకు చెందిన జై శంకర్ ఒక సైకో. ఒంటరిగా ఉన్న మహిళలను గుర్తించిన జై శంకర్ వారి మీద అత్యాచారం చేసి తరువాత దారుణంగా చంపేశాడు. కొంత మంది మహిళలను హత్య చేసిన తరువాత అత్యాచారం చేశాడని అనేక కేసులు నమోదు అయ్యాయి.

రూ. 10 లక్షల బహుమతి
తమిళనాడు, కర్ణాటకలో అనేక మంది మహిళల మీద అత్యాచారం చేసి హత్య చేసిన కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న జై శంకర్ రెండు రాష్ట్రాల పోలీసులకు సవాలుగా మారాడు. సైకో కిల్లర్ జై శంకర్ ను పట్టించిన వారికి రూ. 10 లక్షలు బహుమానం ఇస్తామని పోలీసులు ప్రకటించారు.

సినిమా ఫక్కీలో ఎస్కేప్ !
బీజాపురలో పోలీసులకు చిక్కిన జైశంకర్ సినిమా ఫక్కీలో తప్పించుకుని పారిపోయాడు. తరువాత ఎట్టకేలకు బెంగళూరు పోలీసులకు చిక్కిన జై శంకర్ ను బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో పెట్టారు. ఇతని మీద అనేక కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి.

30 అడుగుల గోడ
2013లో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో 30 అడుగులకు పైగా ఎత్తు ఉన్న ప్రహరీ గోడ దూకిన జై శంకర్ తప్పించుకుని పారిపోయాడు. రెండు కాళ్లకు తీవ్రగాయాలై ఓ చెరువు దగ్గర నడవలేని స్థితిలో గుడిసెలో ఉన్న జై శంకర్ ను మూడు రోజుల తరువాత పోలీసులు పట్టుకున్నారు.

చేతికి బ్లేడ్ చిక్కింది
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న జై శంకర్ మంగళవారం వేకువ జామున బ్లేడ్ తో గొంతు కోసుకున్నాడు. వెంటనే విషయం గుర్తించిన జైలు సిబ్బంది అతనికి విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స చేయించడానికి తరలించారు. అయితే మార్గం మధ్యలో జై శంకర్ మరణించాడని వైద్యులు చెప్పారు. జై శంకర్ చేతికి బ్లేడ్ ఎలా వచ్చింది అని అధికారులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications