Nirbhaya case: ఘోరం చేసి ప్రాణాల కోసం తాపత్రయం, అంతర్జాతీయ కోర్టుకు దోషులు
న్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం చేసి, ఆమెను దారుణంగా హత్య చేసిన దోషులకు ప్రాణాలపై ఆశ చావడం లేదు. నిర్భయ దోషులు తమకు విధించిన ఉరిశిక్షను తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే వారు తమకున్న న్యాయపరమైన అవకాశాలన్నింటినీ ఉపయోగించుకున్న విషయం తెలిసిందే.

అంతర్జాతీయ కోర్టుకు.. ముగ్గురు దోషులు
కాగా, మార్చి 20న నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ ఢిల్లీ పాటియాల కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే మూడుసార్లు ఉరిశిక్షను వాయిదా వేయించిన నిర్భయ దోషులు.. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమకు విధించిన ఉరిశిక్షపై స్టే విధించాలని కోరుతూ దోషులు అక్షయ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ అంతర్జాయ కోర్టు(ఐసీజే)లో పిటిషన్ దాఖలు చేశారు.

ఇప్పటి ఉరిశిక్ష మూడుసార్లు వాయిదా
ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన నేపథ్యంలో.. మార్చి 20న ఉదయం 5.30గంటలకు ఉరితీయాలంటూ ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు ఇటీవల కొత్త డెత్ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. జనవరి 22నే నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించాల్సి ఉండగా.. న్యాయపరమైన అవకాశాల పేరుతో చివరి నిమిషంలో దోషులు కొత్త పిటిషన్లు, దరఖాస్తు పెట్టుకోవడంతో మూడుసార్లు ఉరితీత వాయిదా పడింది.

ప్రాణాల మీద ఆశతో..
ఆ తర్వాత అన్ని న్యాయపరమైన అవకాశాలు కూడా వినియోగించుకోవడంతో ఇటీవల మార్చి 20న ఉరిశిక్షను ఖాయం చేసింది కోర్టు. అయినా కూడా దోషులు శిక్ష నుంచి తప్పించుకునేందుకు తమ ప్రయత్నాలను ఆపడం లేదు. తమకున్న న్యాయపరమైన అవకాశాలను పునరుద్ధించాలని కోరుతు దోషుల్లో ఒకడైన ముకేశ్ కుమార్ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే, కోర్టు అతడి అభ్యర్థనను కొట్టేసింది.

ఉరిపై మరోసారి ఉత్కంఠ..
ఈ నేపథ్యంలో మిగితా ముగ్గురు దోషులు అక్షయ్ కుమార్, పవన్ గుప్తా, వినయ్ శర్మ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వారికి ఉరిశిక్ష అమలుపై మరోసారి సందిగ్ధత నెలకొంది. దోషులకు ఎప్పుడు శిక్ష పడుతుందని ఎదురుచూస్తున్న నిర్భయ తల్లి ఆశాదేవికి తాజా పరిణామం మరింత నిరాశకు గురిచేసేదిగా ఉంది. అయితే, నిర్భయపై ఇంతటి ఘోరానికి పాల్పడిన దోషులకు అంతర్జాతీయ న్యాయస్థానం కూడా క్షమించే అవకాశం లేకపోవచ్చు.












Click it and Unblock the Notifications