సుప్రీం జడ్జిగా ఆంధ్రా 'వెంకటరమణ', భవిష్యత్తులో సిజెగా
పదవీ విరమణ కంటే ముందే 2021లో ఆయన సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 12 లేదా 13న ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. ఆయన ఏడేళ్ల పాటు జస్టిస్గా బాధ్యతలు చేపడతారు. ఆపై పదహారు నెలల పాటు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశముంది.
గతంలో 1966లో మన రాష్ట్రానికి చెందిన జస్టిస్ కోకా సుబ్బారావు ఏడాదికంటే తక్కువ కాలం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. జస్టిస్ ఎన్వి రమణ కృష్ణా జిల్లాలోని పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. అంచెలంచెలుగా ఎదిగిన జస్టిస్ రమణ 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు.
రాష్ట్ర హైకోర్టు, రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టులో సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, కార్మిక, సేవ ఎన్నికల అంశాలకు సంబంధించిన అనేక కేసుల్లో ఆయన వాదించారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు ప్యానల్ న్యాయవాదిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర ప్రభుత్వం, రైల్వే స్టాండింగ్ కౌన్సిల్గా, రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్గానూ వ్యవహారించారు.
మాజీ ముఖ్యమంత్రులు ఎన్టి రామారావుకు, ప్రస్తుత తెదేపా నేత చంద్రబాబుకు వివిధ కేసుల్లో న్యాయవాదిగానూ ఉన్నారు. వివాదస్పదమైన ఆల్మట్టి డ్యాం కేసులో ఆయన సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించారు. రాష్ట్ర హైకోర్టులో జస్టిస్ రమణ 2000 జూన్ 27న న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత 2013 సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.