14 Day Lockdown: కర్ణాటక తరువాత మరో పక్క రాష్ట్రంలో కంప్లీట్ లాక్డౌన్: 5వ తేదీ నుంచి అమలు: రాకపోకలు బంద్
భువనేశ్వర్: మన పొరుగు రాష్ట్రం ఒడిశా కంప్లీట్ లాక్డౌన్లోకి జారుకోనుంది. ఇప్పటిదాకా వీకెండ్లో మాత్రమే లాక్డౌన్ను అమలు చేస్తూ వచ్చిన అక్కడి ప్రభుత్వం.. పూర్తిస్థాయి లాక్డౌన్ను ప్రకటించింది. రెండువారాల పాటు లాక్డౌన్లో ఉండబోతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒడిశా ప్రభుత్వం సంపూర్ణ లాక్డౌన్ను విధించింది. ఈ లాక్డౌన్.. బుధవారం తెల్లవారు జామున 5 గంటల నుంచి అమల్లోకి రానుంది. 14 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ నెల 19వ తేదీ తెల్లవారు జామున 5 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది.
ఒడిశాలో కరోనా పాజిటివ్ కేసుల వెల్లువ కొనసాగుతోంది. ఆదివారం నాటి బులెటిన్ ప్రకారం.. ఆ రాష్ట్రంలో కొత్తగా 8,681 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం నాటితో పోల్చుకుంటే ఈ సంఖ్య కాస్త తగ్గినప్పటికీ.. ఉధృతి మాత్రం అదే స్థాయిలో కొనసాగుతోంది. ఒడిశాలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 4,62,622కు చేరుకోగా.. ఇందులో 2,068 మంది మృత్యువాత పడ్డారు. 3,91,048 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 69,453గా నమోదైంది.

రోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు పుట్టుకొస్తుండటంతో.. లాక్డౌన్ విధించాలని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం నిర్ణయింది. ప్రస్తుతం అక్కడ వీకెండ్ లాక్డౌన్ కొనసాగుతోంది. దాన్ని మరింత పొడిగించింది. 14 రోజుల పాటు అంటే ఈ నెల 19వ తేదీ వరకు అమలు చేయనుంది. లాక్డౌన్ సందర్భంగా ఎలాంటి వ్యాపార కార్యకలాపాలకు అవకాశం ఇవ్వట్లేదు. అత్యవసర సర్వీసులు మినహా మరెలాంటి వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు అందుబాటులో ఉండబోవని ఒడిశా ప్రభుత్వం తెలిపింది.
ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉండదని తెలిపింది. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కబోవని, ప్రైవేటు వాహనాల రాకపోకలపై నిషేధం విధించినట్లు పేర్కొంది. ఎలాంటి అత్యవసర కారణాలను చూపించకుండా రోడ్డెక్కిన వాహనాలను స్వాధీనం చేసుకుంటామని, వారి లైసెన్స్ను రద్దు చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని అధికారులు స్పష్టం చేశారు. లాక్డౌన్ కాలంలో భవన నిర్మాణ పనులను కొనసాగించడానికి అనుమతి ఉంటుంది.
పండ్లు, కూరగాయలు, పాల విక్రయ దుకాణాలను పరిమితంగా అనుమతి ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సినిమా హాళ్లు, షాపింగ్ కాంప్లెక్సులు, మాల్స్, జిమ్నాజియం, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులు, థియేటర్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, ఆడిటోరియాలను మూసివేస్తారు. ఎలాంటి జాతరలను నిర్వహించడానికి అనుమతి లేదు. ఓపెన్ ఎయిర్ థియేటర్లను సైతం మూసివేయాల్సి ఉంటుందని అధికారులు ఆదేశించారు.












Click it and Unblock the Notifications