మంత్రిని పొట్టనబెట్టుకున్న ఎస్ఐ: ఛాతీలో దిగిన బుల్లెట్లు..!!
అసిస్టెంట్ ఎస్సై జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబ కిశోర్ దాస్ కొద్దిసేపటి కిందటే కన్నుమూశారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన భువనేశ్వర్ లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచా
భువనేశ్వర్: ఒడిశాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి నాబ కిశోర్ దాస్ పై అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఒకరు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన ఛాతీలో బుల్లెట్లు దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆయనకు అత్యవసర చికిత్సను అందించినప్పటికీ- ఫలితం దక్కలేదు. కొద్దిసేపటి కిందటే ఆయన కన్నుమూశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్తో ఆ విషయంపై మాట్లాడాను: స్పీకర్ తమ్మినేని సీతారాం..!!
ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో ఈ ఘటన సంభవించింది. జిల్లాలోని బ్రజ్ రాజ్ నగర్ టౌన్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మంత్రి నాబ కిశోర్ దాస్ హాజరు కావాల్సి ఉంది. ఇందులో పాల్గొనడానికి ఆయన ఈ ఉదయం రాజధాని భువనేశ్వర్ నుంచి హెలికాప్టర్ లో బ్రజ్ రాజ్ నగర్ కు చేరుకున్నారు. హెలి ప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్నారు.
అక్కడ కారు నుంచి కిందికి దిగిన కొద్దిసేపటికే మంత్రి నాబదాస్ పై అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ గోపాల్ దాస్ కాల్పులు జరిపారు. నాలుగు నుంచి అయిదు రౌండ్ల మేర కాల్పులు జరిపాడు. అత్యంత సమీపం నుంచి బుల్లెట్ల వర్షాన్ని కురిపించాడు. మంత్రి ఛాతీలోకి నాలుగు బుల్లెట్లు దూసుకెళ్లాయి. వెంటనే ఆయనను తొలుత ఝార్సుగూడ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం- అక్కడి నుంచి భువనేశ్వర్ కు ఎయిర్ లిఫ్ట్ చేశారు.
భువనేశ్వర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించినప్పటికీ.. ప్రాణాలు నిలపలేకపోయారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా- మంత్రిపై ఎఎస్ఐ గోపాల్ దాస్ కాల్పులు జరపడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై విచారణకు ఆదేశించినట్లు ఒడిశా పోలీస్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. ప్రస్తుతం గోపాల్ దాస్ తమ అదుపులో ఉన్నారని బ్రజ్ రాజ్ నగర్ ఎస్డీపీఓ గుప్తేశ్వర్ భోయ్ తెలిపారు. ఆయనపై కేసు నమోదు చేశామని అన్నారు.
ఎవరి ఆదేశాల మేరకు మంత్రిపై ఏఎస్ఐ కాల్పులు జరిపారనేది ఆరా తీస్తోన్నామని, మంత్రిపై వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు సాగిస్తోన్నామని గుప్తేశ్వర్ చెప్పారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే అధికార బిజూ జనతాదళ్ నాయకులు, కార్యకర్తలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకు దిగారు. నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీనితో బ్రజ్ రాజ్ నగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనను ప్రీ ప్లాన్డ్ గా ఆరోపిస్తోన్నారు.
కాగా- ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆసుపత్రికి చేరుకున్నారు. నబదాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చారు. మంత్రి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నబా దాస్ మృతి అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు అని వ్యాఖ్యానించారు. పార్టీకి, ప్రభుత్వానికి ఆయన లేని లోటును పూడ్చలేమని పేర్కొన్నారు.