నిషేధిత ప్రాంతంలో మంత్రి కూతురు, సినీ హీరోయిన్ల హల్చల్: నెటిజన్లు ఊరుకుంటారా?
భువనేశ్వర్: కొందరు ప్రభుత్వంలో ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తులు, ఉన్నతాధికారుల సంతానం తమకు చట్టాలు వర్తించవన్నట్లు వ్యవహరిస్తుంటారు. చట్టాలు, నిబంధనలు తెలిసినా వాటిని పాటించరు. ఒకవేళ నలువైపుల నుంచి విమర్శలు వస్తేగానీ వారిపై చర్యలు కూడా ఉండవు. ఇలాంటి ఘటనే ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది.

హీరకుడ్ సందర్శన
ఒడిశా ఆరోగ్యమంత్రి నబ కిశోర్ దాస్ కుమార్తె దీపాలి దాస్, ఒడియా సినీ హీరోయిన్లు ప్రకృతి మిశ్రా, ఎలినా సమంత్రే తదితరులు ఓ ప్రచారం కార్యక్రమం నిమిత్తం గత శనివారం సంబాల్పూర్ వెళ్లారు. ఈ క్రమంలోనే హీరాకుడ్ డ్యాంను సందర్శించారు.

నిషేధిత ప్రాంతంలో ఫొటోలు, వీడియోలు..
అంతేగాక, హీరాకుడ్ డ్యాంలో నిషేధిత ప్రాంతానికి వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ ఫొటోలను సినీ నటి ప్రకృతి మిశ్రా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో వారిపై నెటిజన్లు విమర్శల వర్షం మొదలైంది. నిషేధిత ప్రదేశంలో మీరెలా ప్రవేశించారని, చట్టాలు మీకేమైనా చుట్టాలా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

నెటిజన్లు ఫైరవడంతో.. తగ్గిన హీరోయిన్లు
మంత్రి కుమార్తె అయితే మాత్రం నిషేధిత ప్రాంతంలో అనుమతి ఇస్తారా? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో ఇలాంటి పొరపాట్లు మరోసారి చేయబోమంటూ హీరోయిన్లు ప్రకృతి మిశ్రా, ఎలినా సమంత్రే నెటిజన్లకు సమాధానం ఇచ్చారు.

కుమార్తె తీరుపై మంత్రి వ్యాఖ్యలు ఆసక్తికరం
ఇది ఇలావుంటే, తన కుమార్తె చేసిన పనిపై రాష్ట్ర మంత్రి నబ కిశోర్ దాస్ స్పందన ఆసక్తికరంగా ఉంది. తన కుమార్తె మైనర్ కాదని, ఆమె తరపున తాను మాట్లాడబోనని స్పష్టం చేశారు మంత్రి. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పుకొచ్చారు.
ఈ విషయం పెద్దదిగా మారడంతో పోలీసులు స్పందించారు. కాగా, ఈ ఘటనపై హీరాకుడ్ ఎస్డీపీవో నుంచి నివేదిక కోరామని, ఆ నివేదిక వచ్చాక తగిన చర్యలు తీసుకుంటామని సంబల్పూర్ ఎస్పీ కన్వర్ విశాల్ మీడియాకు తెలిపారు.












Click it and Unblock the Notifications