ఒడిశా రైలు ప్రమాదం: సీబీఐ ఛార్జీషీటు, ముగ్గురు ఉద్యోగులపై నేరాభియోగాలు
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఒడిశా రైలు ప్రమాద ఘటనకు సంబంధించి సీబీఐ ఛార్జీషీటు దాఖలు చేసింది. ఈ ప్రమాదంలో 296 మంది ప్రాణాలు కోల్పోగా.. 1200 మందికిపైగా గాయపడ్డారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. ముగ్గురు రైల్వే ఉద్యోగులపై సీబీఐ ప్రత్యేక కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేసింది. రైల్వే చట్టంలోని 153 సెక్షన్ తోపాటు సాక్ష్యాలను నాశనం చేసేందుకు యత్నించడం, హత్యతో సమానమైన నేరాభియోగాలను మోపింది.
రైలు ప్రమాదంలో కుట్ర కోణం అనుమానాల నేపథ్యంలో రంగంలోకి దిగింది సీబీఐ. జులై 7న సీనియర్ సెక్షన్ ఇంజినీర్(సిగ్నల్స్) అరుణ్ కుమార్ మహంత, సెక్షణ్ ఇంజినీర్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్లను అరెస్ట్ చేసింది. ఈ ముగ్గురిపైనే నేరాభియోగాలు మోపింది.

బాహానగా బజార్ స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగిన 94వ లెవల్ క్రాసింగ్ గేట్ వద్ద మరమ్మతు పనులు మహంత సమక్షంలోనే జరిగాయి. అయితే, ఈ పనులకు 79వ లెవల్ క్రాసింగ్ గేట్కు సంబంధించిన రేఖాచిత్రాన్నే ఉపయోగించారని సీబీఐ పేర్కొంది. ఇప్పటికే ఉన్న సిగ్నల్, ఇంటర్ లాకింగ్ వ్యవస్థలను పరీక్షించడం, మరమ్మతులు చేపట్టడం, మార్పులు చేయడం తోపాటు ఆమోదిత ప్రణాళిక, సూచనలకు అనుగుణంగా ఉన్నతాయనేది నిర్ధారించుకోవాడం మహంత పని అని.. అయితే, ఆయన దీన్ని విస్మరించారని సీబీఐ పేర్కొంది.
ఇటీవల మహంత బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగానూ సీబీఐ ఇదే వాదన వినిపించింది. దీంతో కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది. ఈ ఏడాది జులై 2న బాలసోర్ జిల్లాలోని బాహానగా బజార్ స్టేషన్ వద్ద.. లూప్లైన్లో ఆగివున్న గూడ్స్ రైలును షాలీమార్-చెన్నై కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఢీనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
ప్రమాద తీవ్రతకు కోరమాండల్లోని కొన్ని బోగీలు ఎగిరి, పక్కనున్న ట్రాక్పై పడ్డాయి. దీంతో అప్పటికే ఆ మార్గంలో దూసుకొస్తున్న బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ రైలులోని కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. ఇదంతా క్షణాల్లో జరిగిపోవడంతో ఎవరూ ఊహించని ప్రాణ నష్టం సంభవించింది. అనుమతులు లేని మరమ్మతులు చేపట్టడమే ఈ ప్రమాదానికి కారణమని సీబీఐ ఇప్పటికే పేర్కొంది. తాజాగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ ముగ్గురు ఉద్యోగులపై నేరాభియోగాలు మోపింది.












Click it and Unblock the Notifications