రూ.25వేలకు వస్తావా?: కామాంధుడి దిమ్మదిరిగేలా చేసిన శ్రీలక్ష్మి(పిక్చర్స్)
కన్సల్టెన్సీ విద్యా సంస్థను నిర్వహిస్తూ చాలా మంది విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతున్న ఓ మహిళను ఓ కామాంధుడు ఫోన్ ద్వారా తీవ్ర లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
తిరువనంతపురం: కన్సల్టెన్సీ విద్యా సంస్థను నిర్వహిస్తూ చాలా మంది విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతున్న ఓ మహిళను ఓ కామాంధుడు ఫోన్ ద్వారా తీవ్ర లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె అతనికి అదే స్థాయిలో ఘాటైన సమాధానం ఇచ్చింది. అతనికి రాజకీయ అండదండలున్నప్పటికీ వెరవలేదు. దీంతో నిందితుడు, అతడి తండ్రి, రాజకీయ పార్టీ నేతలు కూడా ఆమె వద్దకు కాళ్ల బేరానికి వచ్చారు. ఇక్కడ కూడా ఆమె తన పెద్ద మనసును చాటుకున్నారు. నిందితులతో ఓ స్వచ్ఛంద సంస్థకు భారీగా విరాళం ఇప్పించారు.
నీచమైన వేధింపులు
కేరళలోనే ప్రముఖ విద్యా సంస్థ కన్సల్టెన్సీకి సీఈఓగా, మోటివేషనల్ స్పీకర్గా శ్రీలక్ష్మి సతీష్ పని చేస్తున్నారు. కాగా, కొంతకాలంగా ఆమెకు ఓ కామాంధుడు ఫోన్ చేసి వేధింపులకు గురిచేస్తున్నాడు. ఎంతలా అంటే.. ‘మనం ఎప్పుడు కలుద్దాం, మీ రేటు ఎంత? రూ. 3000కు వస్తావా? హోటల్ గది బుక్ చేయమంటారా?' అంటూ నీచంగా వేధించాడు.
గుణపాఠం చెప్పాలని..
అంతేగాక, రూ. 25000 ఇస్తాను రమ్మంటూ వేధించాడు. ఇవన్నీ భరించలేక ఆమె చివరకు సెల్ ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ చేశారు. అయితే, తనను వేధించే వారికి సరైన గుణపాఠం చెప్పాలనుకున్నారు. ఈ క్రమంలోనే అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు తనకు ఫోన్ చేసిన వారికి ఆమె మళ్లీ ఫోన్ చేశారు. తన నంబర్ ఉన్న వాట్సాప్ గ్రూప్తో జరిపిన సంభాషణ స్క్రీన్ షాట్లను ఆమె సంపాదించారు. దీని ఆధారంగా తన ఫోన్ నంబర్ను దుర్వినియోగం చేసిన వ్యక్తిని గుర్తించారు.
శ్రీలక్ష్మి షరతులు
కాగా, నిందితుడు ఒక జాతీయ పార్టీ యువజన విభాగంలో ప్రాంతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నాడని తెలుసుకున్నారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఇంతలో పార్టీ నాయకులు రంగంలోకి దిగి ఈ వ్యవహారాన్ని కోర్టు బయటే రాజీ చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు శ్రీలక్ష్మి పలు షరతులు విధించారు.
సానుకూల స్పందన రాకపోవడంతో..
తన ఫోన్ నంబర్ను దుర్వినియోగం చేసిన వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరించాలని, దీనికి సంబంధించిన సమావేశం వివరాలు తనకు అందించాలని తేల్చిచెప్పారు. గురువారం రాత్రి 8 గంటలకు సానుకూల స్పందన రాకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించేందుకు మరోసారి సిద్ధమయ్యారు.
కాళ్ల బేరానికి వచ్చారు..
అయితే, ఇప్పుడు నిందితుడి తండ్రి శ్రీలక్ష్మి వద్దకు వచ్చి తన కొడుకును క్షమించాలని, కేసు పెట్టొద్దని వేడుకున్నాడు. తాను చెప్పినట్టుగా చేస్తే కేసు పెట్టనని చెప్పడంతో ఆయన అంగీకరించాడు. నిందితుడు ఏదైనా స్వచ్ఛంద సంస్థకు కూ. 25000 విరాళం ఇవ్వాలని, దీనికి సంబంధించిన రసీదు తనకు అందజేయాలని ఆమె అతనికి చెప్పారు. దీంతో శ్రీలక్ష్మి చెప్పినట్టుగానే చేసి రసీదు ఆమెకు ఇచ్చారు.
శ్రీలక్ష్మికి ప్రశంసలు
ఆ దుర్మార్గుడు చేసిన దానికి తన కోపం చల్లారకపోవడంతో ఈ వ్యవహారం గురించి శ్రీలక్ష్మి తన ఫేస్బుక్ పేజీలో వివరంగా రాశారు. దీనికి 1317కుపైగా షేర్లు, 1200కుపైగా కామెంట్లు, 4500కుపైగా లైకులు వచ్చాయి. తనను అవమానించిన వాడికి తగిన గుణపాఠం చెప్పారని శ్రీలక్ష్మిని నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా ప్రశంసించారు. అయితే ఇదంతా తాను ప్రచారం కోసం చేయలేదని, ఇలాంటి వారికి బుద్ధిరావాలని మాత్రమే చేశానని శ్రీలక్ష్మి తెలిపారు.