ఏపీ వాతావరణంలో అకస్మాత్ మార్పులు- ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీలో నేడు వాతావరణ పరిస్థితులు వేగంగా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణంలో అకస్మాత్తుగా సంభవిస్తున్న ఈ మార్పుల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల యంత్రాంగాన్ని ఆదేశించింది.
విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ లోని పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు రకపు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో గాలిలో తేమ శాతం పెరిగి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

పిడుగుల ముప్పు పొంచి ఉన్నందున బహిరంగ ప్రదేశాలలో తిరిగే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పొలాల్లో పనులకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద గానీ, ఒంటరిగా ఉన్న విద్యుత్ స్తంభాల కింద గానీ ఆశ్రయం పొందకూడదని సూచించింది. పల్నాడు వంటి ఇతర జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి జల్లులు పడే వీలుంది.
వర్షానికి తోడు బలమైన గాలులు వీచే ప్రమాదం ఉన్నందున పాత ఇళ్లు, బలహీనమైన షెడ్లు, భారీ ప్రకటనల బోర్డుల కింద ఎవరూ నిలబడకూడదని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు. ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.
పొలాల్లో పనిచేసే సమయంలో వృక్షాల కింద లేదా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో ఆశ్రయం పొందడం అత్యంత ప్రమాదకరమని విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. తడిచిన నేల, తడి గడ్డి విద్యుత్ వాహకాలుగా పనిచేస కాబట్టి, ఉరుములు వచ్చే సమయాల్లో మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండటం మంచిదని, పశువులను కూడా చెట్లకు కట్టేయకుండా సురక్షితమైన షెడ్లలో ఉంచాలని సూచించింది.












Click it and Unblock the Notifications