ఊరట: పాత నోట్లపై కేంద్రం మరో 10రోజుల వెసులుబాటు, టోల్ట్యాక్స్ కూడా
న్యూఢిల్లీ: ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు ఇంకాస్త ఊరట కలిగించేలా పెద్ద నోట్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత నోట్ల చెల్లుబాటు తేదీని నవంబర్ 24 వరకూ పొడిగిస్తున్నట్టు వెల్లడించింది.
అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ షాపులు, పెట్రోలు బంకులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో వీటిని వినియోగించుకోవచ్చని, పౌర సేవల బిల్లులు చెల్లింవచ్చని పేర్కొంది. నవంబర్ 14తో ముగుస్తున్న ఈ గడువును 24వ తేదీ వరకు పెంచుతూ కేంద్రం సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీచేసింది.
నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రధాని మోడీ గత మంగళవారం అర్ధరాత్రి నుంచి రూ.500, 1000 నోట్ల రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రూ.500, 2000 నోట్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పాతనోట్లను మార్చుకునేందుకు ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు.

ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం నోట్ల మార్పిడి.. నగదు ఉపసంహరణలో కాస్త వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. రూ.500, రూ.1000 పాతనోట్లను బ్యాంకులో మార్చుకునేందుకు పరిమితి రూ.4000 నుంచి రూ.4,500కు పెంచింది.
ఏటీఎంలలో నగదు ఉపసంహరణ పరిమితి రోజుకు రూ.2000 నుంచి రూ.2,500కి పెంచింది. అంతేగాక, బ్యాంకు కౌంటర్ల నుంచి ఒక వారంలో తీసుకోగలిగే నగదు పరిమితి రూ.20,000 నుంచి రూ.24,000కు పెంచింది. ఈ మొత్తాన్ని రోజుకు గరిష్ఠంగా రూ.10,000 చొప్పున తీసుకోవచ్చనే పరిమితి తొలగించింది.
కాగా, పాత నోట్లను రద్దు చేసిన తరువాత, వాటి చెల్లుబాటును పొడిగించడం ఇది రెండోసారి. రూ. 500 నోట్లను విడుదల చేసిన తరువాత బ్యాంకులపై కొంత వరకూ ఒత్తిడి తగ్గనుందని నిపుణులు వ్యాఖ్యానించారు.
టోల్ ట్యాక్స్ రద్దు మరో 4 రోజులపాటు పొడగింపు
వాహనదారులకు కూడా కేంద్రం ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది.
టోల్ ఫీజు రద్దు గడువు మరో నాలుగు రోజులపాటు పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. చిల్లర సమస్య తీరకపోవడంతో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications