లోక్సభ స్పీకర్ పదవిపై వీడిన సస్పెన్స్..: చంద్రబాబు తప్పుకోవడంతో..!!
Lok Sabha Speaker: లోక్సభ స్పీకర్ ఎన్నికపై ఏర్పడిన సస్పెన్స్ తొలగిపోయింది. కొత్త స్పీకర్ ఎవరనేది తేలిపోయింది. మొదట్లో ఈ పదవి కోసం పట్టుబట్టిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షం తెలుగుదేశం పార్టీ.. ఆ తరువాత రేసు నుంచి స్వచ్ఛందంగా తప్పుకొంది. దీనితో ఈ పదవిని నిలబెట్టుకుంది భారతీయ జనతా పార్టీ.
18వ లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా నామినేట్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఎంపికను బీజేపీ అగ్రనాయకత్వం కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. ఇంకాస్సేపట్లో ఆయన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ప్రస్తుతానికి స్పీకర్ రేసులో ఆయన ఒక్కరే ఉన్నారు. ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా తన అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు లేకపోలేదు.

17వ లోక్సభకు ఓం బిర్లా స్పీకర్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఆయననే కొనసాగించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. వివాదరహితుడు కావడం, స్పీకర్ హోదాలో సమన్యాయాన్ని పాటించారనే సదభిప్రాయం ఓం బిర్లాపై ఉండటమే కారణమని చెబుతున్నారు.
ఈ హోదా కోసం మొన్నటివరకు తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిపట్టు పట్టారు. బీజేపీని నియంత్రించడానికి ఈ పదవి అవసరమౌతుందని ఆయన భావించారు. దీనికి అనుగుణంగా పావులు కదిపారు. తమ పార్టీ తరఫున లోక్సభ స్పీకర్గా నామినేట్ చేయడానికి అభ్యర్థిని సైతం సిద్ధం చేసుకున్నట్లు వార్తలొచ్చాయి.
అనూహ్యంగా చంద్రబాబు ఈ రేసు నుంచి తప్పుకొన్నారు. స్పీకర్గా ఎవరిని ఎన్నుకున్నా తాము మద్దతు ఇస్తామని చంద్రబాబు తేల్చి చెప్పారు. పదవుల కోసం ఆశపడితే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయంటూ వ్యాఖ్యానించారాయన మొన్నటికి మొన్న. దీనితో స్పీకర్గా ఓం బిర్లా నామినేట్ చేయడానికి అవకాశం చిక్కినట్టయింది.
మొన్నటి ఎన్నికల్లో రాజస్థాన్లోని కోటా-బూందీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు ఓం బిర్లా. ఇక్కడి నుంచి ఆయన గెలవడం ఇది మూడోసారి. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్కు చెందిన ప్రహ్లాద్ గుంజాల్ను 41 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు.












Click it and Unblock the Notifications