ఇదెక్కడి గోలరా నాయనా: కరెంటు పోయింది..! పెళ్లి కూతురు మారింది!!
అనుకున్న దొక్కటి.. అయినదొక్కటి.. బోల్తా కొట్టావులే బుల్బుల్ పిట్ట అనే మన తెలుగు పాటలను ఇప్పుడు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో బాగా పాడుతున్నారు.అసలు ఈ పాట ఎందుకు పాడుతున్నారు... జరిగిందేమిటో తెలిస్తే మీరు నోరెళ్లట్టడం ఖాయం.

ఉజ్జయినీలో పెళ్లి వేడుక
ఉజ్జయినికి చెందిన రమేశ్లాల్ తన ఇద్దరు కుమార్తెలు నికిత, కరిష్మాకు ఒకేసారి వివాహం చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. వేర్వేరు కుటుంబాలకు చెందిన దంగ్వారా భోలా, గణేష్ అనే యువకులతో వివాహ వేడుక వైభవంగా నిర్వహించారు. పెళ్లి సమయంలో వధువులిద్దరూ బురఖా ధరించారు. దుస్తులు కూడా ఇద్దరూ ఒకేరకమైనవి ధరించారు. అనుకోకుండా అకస్మాత్తుగా కరెంటు పోయింది.

చీకటిలోనే వివాహ తంతు
ఆ చీకటిలోనే పురోహితుడు వివాహ తంతును జరిపించారు. వధువులిద్దరికీ తాళి కట్టించారు. అనంతరం అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. అప్పగింతలు కూడా అయిపోయాయి. పెళ్లికి వచ్చినవారంతా తృప్తిగా భోజనాలు చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు. తర్వాత పెళ్లికొడుకులు ఎవరికి వారు తమ తమ భార్యలను తీసుకొని ఇంటికి చేరుకున్నారు.

ఖంగుతిన్న పెళ్లి కొడుకులు
ఇంటికెళ్లిన తర్వాత వధువులు బురఖా తీయగా ఖంగుతినడం పెళ్లికొడుకుల వంతైంది. తాము చూసింది.. సంబంధం మాట్లాడుకుంది మరో అమ్మాయితో. మరి ఈ అమ్మాయికి తాళి ఎట్లా కట్టామని ఆలోచించగా కరెంటు పోవడంతో చీకటిలో తప్పు జరిగిందని, వధువులిద్దరూ ఒకేరకమైన దుస్తులు కూడా కారణమని భావించారు. అనుకున్నది ఒకరితో.. తాళి కట్టింది మరొకరితో అని అర్థమైంది. దీంతో పెళ్లికొడుకులిద్దరూ వెంటనే అత్తగారింటికి చేరారు.

మరోసారి వివాహ వేడుక
సాంప్రదాయం ప్రకారం తాళి కట్టినవారే భార్య అవుతారని అత్తగారు, మామగారితోపాటు పెద్దలు కూడా సర్దిచెప్పాలని చూశారు. అయితే రెండువైపులా వాగ్వాదం తీవ్రంగా జరిగింది. చివరకు మరోసారి వివాహ వేడుక జరపాలని, ఈసారి ఎవరు కోరుకున్న అమ్మాయి మెడలో వారే తాళికట్టేలా జాగ్రత్త పడాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఈ వార్త దేశమంతా వైరల్ అయ్యింది. మీరు కూడా పెళ్లి చేసుకునే సమయంలోకరెంటు పోకుండా చూసుకోండంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications