షాక్: పిల్లే కాదు, కుక్క మాంసంతోనూ బిర్యానీ వడ్డిస్తున్నారు!
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఇటీవల పిల్లి మాంసంతో బిర్యానీ చేసి చికెన్, మటన్ బిర్యానీ అంటూ తక్కువ ధరకే హోటల్స్, రోడ్డు పక్కన తోపుడు బండ్లలో విక్రయిస్తున్నట్లు తేలిన విషయం తెలిసిందే. ఇప్పుడు చెన్నై నగరంలో మరో షాకింగ్ న్యూస్ సంచలనం సృష్టిస్తోంది.
కుక్కమాంసంతో బిర్యానీ తయారు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఫొటోలు చక్కర్లు కొడుతుండటం పలువుర్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. నిజాన్ని నిగ్గు తేల్చడానికి 'పీపుల్ ఫర్ కెటిల్ ఇన్ ఇండియా' (పీఎఫ్సీఐ) నిర్వాహకులు రంగంలోకి దిగారు. చెన్నైలోని పలు హోటళ్లలో మేక మాంసం పేరిట పశుమాంసాన్ని వండి పెడుతున్నారంటూ కొన్నేళ్ల క్రితం వార్తలు వచ్చాయి.
అనంతరం రోడ్డు పక్కన తోపుడు బండ్లలో బిర్యానీని పిల్లిమాంసంతో చేస్తున్నట్టు కొద్ది రోజుల క్రితం వాట్సాప్లో ఫొటోలతో సహా వార్తలు చక్కర్లు కొట్టాయి. పీఎఫ్సీఐ నిర్వాహకులు పరిశీలించి ఈ వార్తలు వాస్తవమేనని తేల్చారు. తోపుడు బండ్ల వారికి పిల్లులను విక్రయిస్తున్న పలువురు సంజారజాతుల వ్యక్తులను అదుపులోకి తీసుకుని, పోలీసులకు అప్పగించడంతోపాటు పలు పిల్లులను రక్షించారు.

ఈ వ్యవహారం ముగిసిందో లేదో.. ఇప్పుడు పలు హోటళ్లు, రోడ్డు వెంబడి దుకాణాల్లో కుక్క మాంసంతో బిర్యానీ చేసి విక్రయిస్తున్నట్టు వాట్సాప్లో ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, బెంగళూరులో ఇలా చేసిన కొందర్ని పోలీసులు అరెస్టు చేసినట్టు పీఎఫ్సీఐ తెలిపింది. చెన్నైలోనూ ఈ తరహా ఘటనకు అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. దీనిపై నిగ్గు తేల్చడానికి ఇప్పటికే పలు హోటళ్లపై నిఘా ఉంచామని పీఎఫ్సీఐ నిర్వాహకుడు అరుణ్ తెలిపారు.
కాగా, వినియోగదారుల ఆరోగ్యం గురించి ఆలోచించకుండా ఇలా పిల్లి, కుక్క మాంసాలతో బిర్యానీలు చేసి వడ్డించడం పట్ల సామాజిక కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఆందోలన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications