Omicron: న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు, డీజేల నిషేధం, రెండు డోసులు తీసుకుంటేనే..
బెంగళూరు: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 2వ తేదీ వరకు ఎలాంటి బహిరంగ పార్టీలు, సామూహిక వేడుకలకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
పబ్బులు, రెస్టారెంట్లు, అపార్ట్మెంట్లలో డీజేల వినియోగంపై నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి క్రమంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి దృష్ట్యా నూతన సంవత్సర వేడుకలపై నిపుణులతో మంగళవారం సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.

నిపుణుల సిఫార్సుల మేరకే రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నామని, డిసెంబర్ 30 నుంచి జనవరి 2 తేవీ వరకు బహిరంగ ప్రదేశాల్లో సామూహిక కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ తెలిపారు. పబ్లు, రెస్టారెంట్లలో 5 శాతం సామర్త్యంతో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవచ్చని చెప్పారు. అయితే అక్కడ డీజేలతో పార్టీలు చేసుకునేందుకు అనుమతి లేదన్నారు.
అంతేగాక, రెండు డోసుల టీకా తీసుకున్నవారిని మాత్రమే పబ్బులు, రెస్టారెంట్లలోకి అనుమతించాలని స్పష్టం చేశారు. అదే విధంగా, అపార్ట్మెంట్లలోనూ డీజేలను నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు సీఎం బసవరాజ్ బొమ్మై. కాగా, కర్ణాటక రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 19 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో ఆంక్షలకు సిద్ధమైంది కర్ణాటక ప్రభుత్వం. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహిస్తోంది. కరోనా లక్షణాలుంటే ఐసోలేషన్లోకి తరలిస్తోంది. మరోవైపు దేశంలోనూ ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 200కుపైగా ఒమిక్రాన్ కేసులు మనదేశంలో వెలుగుచూశాయి.












Click it and Unblock the Notifications