ఒమిక్రాన్ విజృంభిస్తోన్న వేళ..మరో రెండు డోసుల వ్యాక్సిన్: నిపుణుల కమిటీ భేటీ
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్.. భారత్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. నాలుగు రాష్ట్రాల్లో తిష్ఠ వేసింది. ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుదల బాట పట్టింది. ఇప్పటికే 21 కేసులు వెలుగులోకి వచ్చాయి. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీలల్లో ఈ కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. వాటి సంఖ్య పెరగదనడానికి ఎలాంటి గ్యారంటీ ఉండట్లేదు.
బూస్టర్ డోస్..
దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త కరోనా వైరస్ వేరియంట్ ప్రపంచ దేశాలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ పరిస్థితుల మధ్య దేశంలో కొనసాగుతోన్న కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొత్తగా బూస్టర్ డోస్ (Booster dose)ను అందుబాటులోకి తీసుకుని రావడానికి కసరత్తు చేస్తోంది. దీనితో పాటు అదనపు డోస్ వ్యాక్సిన్ను కూడా ఇవ్వాలని భావిస్తోంది.
ప్యానెల్ కమిటీ భేటీలో..
బూస్టర్ డోస్ను అందుబాటులోకి తీసుకుని రావడం, దానికి సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేయడం, ప్రాధాన్యత క్రమాన్ని నిర్ధారించడం వంటి అంశాలపై ఈ ప్యానెల్ కమిటీ చర్చిస్తుంది. అదనంగా మరో డోస్ను ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదా? అనే విషయం కూడా ప్యానెల్ కమిటీ భేటీలో చర్చకు రానుంది. అనారోగ్యంతో బాధపడే వారికి అదనంగా మరో డోస్ వ్యాక్సిన్ ఇచ్చే అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
18 ఏళ్ల లోపు వారికి..
అదనపు డోస్ ఇవ్వడంలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనే విషయంపై దృష్టి సారించింది. ఈ విషయాలన్నింటి మీదా చర్చించడానికి ఇవ్వాళ వ్యాక్సినేషన్ ప్యానెల్ కమిటీ భేటీ కానుంది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ప్యానెల్ కమిటీ దేశ రాజధానిలో సమావేశం కానుంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి నిపుణులతో కూడిన ప్యానెల్ కమిటీ ఇది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం 18 సంవత్సరాలకు పైనున్న వయస్సు వారికే పరిమితమైంది.
ప్రాధాన్యత క్రమం మారే ఛాన్స్
18 ఏళ్ల లోపు వయస్సున్న వారికి ఇంకా వ్యాక్సిన్ అందాల్సి ఉంది. ఈ కేటగిరీకి చెందిన వారికి ఎప్పుడు వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందనే విషయంపై ప్యానెల్ కమిటీ చర్చిస్తుంది. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రాకపోయి ఉంటే 2 నుంచి 18 సంవత్సరా లోపు వయస్సు ఉన్న వారికి వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ మరింత ఊపందుకుని ఉండేది. ఈ కొత్త వేరియంట్ భారత్లో ఎంట్రీ ఇవ్వడం ప్రాధాన్యత క్రమం పూర్తిగా మారిపోయే పరిస్థితి నెలకొంది. వీటన్నింటిపైనా సమగ్రమైన విధానాన్ని రూపొందించే విషయంపై ఈ ప్యానెల్ కమిటీ చర్చిస్తుంది.
Recommended Video
21 కేసులు..
దేశంలో ఇప్పటిదాకా 21 ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొలుత బెంగళూరులో రెండు కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత గుజరాత్లోని జామ్నగర్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీల్లో వరుసగా వెలుగు చూశాయి. అత్యధికంగా రాజస్థాన్లో తొమ్మిది ఒమిక్రాన్ కేసులు రికార్డయ్యాయి. దక్షిణాఫ్రికాకు వెళ్లొచ్చిన ఓ కుటుంబం ద్వారా ఇతరులకు ఈ వేరియంట్ సోకింది. డెల్టా ప్లస్తో పోల్చుకుంటే నాలుగు రెట్లు వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు దీనికి ఉన్నాయి. మహారాష్ట్ర-7, బెంగళూరు-2, గుజరాత్, ఢిల్లీల్లో ఒక్కో కేసు నమోదైంది.