Omicron: అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణ మరింత ఆలస్యం: డీజీసీఏ వివరణ
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఓమిక్రాన్ కరోనా వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే అనేక దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. భారత్ కూడా అదే బాటలో నడుస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించుకున్నప్పటికీ.. ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో వెనక్కి తగ్గింది.
డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమానాల సేవలను పూర్థిస్థాయిలో పునరుద్ధరించాలనే నిర్ణయం అమలును వాయిదా వేస్తున్నట్లు బుధవారం పౌర విమానయాన నియంత్రణ సంస్థ(డీజీసీఏ)ప్రకటించింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను వణికిస్తున్న తరుణంలో అంతర్జాతీయంగా పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ వెల్లడించింది.

విమానాల పునరుద్ధరణ ఎప్పటి నుంచి అనేది త్వరలోనే తెలియజేస్తామని తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో గత సంవత్సరం మార్చి 23 నుంచి నిలిచిపోయిన షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమాన సర్వీసులను డిసెంబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని గత నెలలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వ్యాప్తి భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అధికారులకు సూచించారు.
ఈ క్రమంలో అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణను డీజీసీఏ వాయిదా వేసింది. అయితే, 28 దేశాలతో కుదుర్చుకున్న ఎయిర్ బబుల్ బప్పందంలో భాగంగా కొన్ని నిర్దేశించిన దేశాలకు మాత్రమే ప్రస్తుతం భారత్ నుంచి పరిమిత సంఖ్యలో ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీసులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఓమిక్రాన్ వెలుగుచూసిన దక్షిణాఫ్రికాకు రాకపోకలను ఇప్పటికే పలు దేశాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ అంక్షల అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రేయేసస్ స్పందించారు. ఓమిక్రాన్ వ్యాప్తిపై అతిగా స్పందించవద్దని ప్రపంచ దేశాలకు సూచించారు. కఠిన ఆంక్షలు అవసరం లేదన్నారు. తమ ప్రజలను కాపాడుకోవాలని దేశాలు భావించడాన్ని తాము అర్థం చేసుకోకున్నామని, కానీ, ఒమిక్రాన్ వేరియంట్ పై తమకింకా పూర్తి అవగాహన రాలేదని చెప్పారు.
కొత్త వేరియంట్ తీవ్రత ఎంత? ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్లు ఓమిక్రాన్ ను సమర్థంగా ఎదుర్కోగలవా? అనే ప్రశ్నలకు సమాధానం అన్వేషించాల్సి ఉందని టెడ్రోస్ తెలిపారు. ఓమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉన్నా.. ఇప్పటి వరకు ఈ వేరియంట్ కారణంగా ఒక్క మరణం కూడా నమోదు కాలేదని స్పష్టం చేశారు. అయినా అప్పుడే కొన్ని దేశాలు వైరస్ కట్టడికి అనవసరంగా కఠిన ఆంక్షలు విధిస్తున్నాయని, వీటి వల్ల వైరస్ ను నియంత్రించలేమని అన్నారు. పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, పరిస్థితులు మరింతగా దిగజారుతాయని టెడ్రోస్ అథనామ్ వ్యాఖ్యానించారు.
Recommended Video
ఓమిక్రాన్ వేరియంట్ గురించి పూర్తిగా తెలియక ముందే దక్షిణాఫ్రికాపై ఆంక్షలు విధించవద్దని టెడ్రోస్ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఒమిక్రాన్ పై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్న దక్షిణాఫ్రికా, బోట్సావానా దేశాలకు టెడ్రోస్ కృతజ్ఞతలు తెలిపారు. సరైన పనిచేస్తున్నందుకు ఆ దేశాలను ఇతర దేశాలు శిక్షిస్తుండటం సరికాదని అన్నారు. ఓమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. డెల్టా కంటే తీవ్రత తక్కువగానే ఉందని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications