Omicron: కొత్త వేరియంట్పై ప్రధాని మోడీ ఫస్ట్ రియాక్షన్: సుతిమెత్తగా వార్నింగ్
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కొత్త కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా స్పందించారు. దేశ ప్రజలను ఆయన సున్నితంగా హెచ్చిరకలను జారీ చేశారు. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఈ అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ వేరియంట్ ఇప్పటికే కెనడాలో ప్రవేశించింది. ఇద్దరు కెనడియన్లు ఈ వైరస్ బారిన పడ్డారు. వారి ట్రావెల్ హిస్టరీని బట్టి చూస్తే.. కొద్దిరోజుల కిందటే ఆఫ్రికా దేశమైన నైజీరియాలో పర్యటించి స్వదేశానికి తిరిగి వెళ్లినట్లు తేలింది.

ఆఫ్రికా ఖండం దాటిన వైరస్..
ప్రస్తుతం ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఆఫ్రికా దేశాల్లో పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతోన్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని పలు దేశాలు.. ఆఫ్రికాతో వాయు సంబంధాలను తెంచుకున్నాయి. విమాన సర్వీసులను నిలిపివేశారు. ఇజ్రాయెల్, జర్మనీ, బ్రిటన్, ఇటలీ, కెనడా, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, జపాన్, చైనా వంటి దాదాపు దేశాలు కూడా ఆఫ్రికన్ కంట్రీస్కు విమానాలను నడిపించట్లేదు. తాత్కాలికంగా రద్దు చేసుకున్నాయి. భారత్ కూడా ఇదే జాబితాలో చేరింది.

తొలిసారిగా స్పందించిన మోడీ..
డిసెంబర్ 15వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రావాలని తొలుత నిర్ణయించినా.. దాన్ని వెనక్కి తీసుకుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసుల నిషేధాన్ని కొనసాగిస్తామని తెలిపింది. ఈ పరిణామాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ- తొలిసారిగా ఈ ఒమిక్రాన్ వేరియంట్పై స్పందించారు. శీతాకాల సమావేశాల్లో పాల్గొనడానికి పార్లమెంట్కు చేరుకున్న ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.

పోరాటం ముగియలేదు..
కరోనా మహమ్మారి విషయంలో కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని, దేశ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండక తప్పదని మోడీ హెచ్చరించారు. కరోనాపై పోరాటం ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు. దేశ ప్రజలు ఈ వైరస్పై తమ పోరాటాన్ని కొనసాగించాల్సిందేనని తేల్చి చెప్పారు. ప్రతి ఒక్క పౌరుడి ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. ఈ కొత్త వేరియంట్పై అప్రమత్తంగా ఉన్నామని, ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకుంటున్నామని, దీనికి అనుగుణంగా ప్రొటోకాల్స్లను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.

100 కోట్లను దాటేశాం..
కరోనా మహమ్మారిని రూపుమాపడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని శరవేగంగా పూర్తి చేస్తోన్నామని ప్రధాని అన్నారు. ఇప్పటికే 100 కోట్ల మందికి పైగా ప్రజలకు వ్యాక్సిన్ను అందజేశామని చెప్పారు. రెండు డోసుల వ్యాక్సిన్ కలిపి 150 కోట్లకు చేరుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రధాని పునరుద్ఘాటించారు. వ్యాక్సిన్ పట్ల భయాందోళనలు ఉంటే వాటిని తరిమి కొట్టాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో ఎలాంటి వైరస్ను అయినా రూపుమాపగలమని వ్యాఖ్యానించారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని, ముఖానికి మాస్కులను ధరించాలని సూచించారు.

వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు..
మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు సంబంధించిన ది ఫార్మ్ లాస్ రిపీల్ బిల్-2021ను వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సభలో ప్రవేశపెట్టార. దీనిపై చర్చ సాగాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన సభలో మాట్లాడుతున్నారు. అనంతరం ది అసిస్టెడ్ రీప్రొడక్టివిటీ టెక్నాలజీ (రెగ్యులేషన్ బిల్లు)-2020ను డాక్టర్ మన్సుఖ్ భాయ్ మాండవీయ సభ ముందుకు తీసుకొస్తారు. దీనిపై చర్చ కొనసాగుతుంది.
అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య కొంతసేపు డిబేట్ సాగుతుంది. మూడు వ్యవసాయ చట్టాలను ఎందుకు ఉపసంహరించుకోవాల్సి వచ్చిందనే విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇస్తుంది.












Click it and Unblock the Notifications