కరోనా విలయం: భారత్ 1లక్ష కేసులు.. రోజుకో రికార్డు చెరిగిపోతూ..
భూగోళాన్ని కబళించిన కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 50 లక్షలకు చేరువకాగా, మరణాల సంఖ్య 3లక్షలు దాటింది. మన దేశంలో సోమవారం ఒక్కరోజే కొత్తగా 5వేల పైచిలుకు కేసులు నమోదు కావడంతో టోటల్ ట్యాలీ 1లక్ష దాటేసింది. అందులో 39వేల మంది వ్యాధి నుంచి కోలుకోగా, 3,155 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతానికి యాక్టివ్ కేసుల సంఖ్య 58 వేలుగా ఉంది. అంకెల విషయంలో రోజుకో రికార్డు చెరిగిపోతుండటం గమనార్హం. అయితే సోమవారం నుంచి భారీ ఎత్తున సడలింపులు అమలులోకి రావడంతో మున్ముందు ఏం జరగబోతోందనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతోందా ? కేసుల క్షీణత వెనుక ?
పాజిటివ్ కేసుల విషయంలో సౌత్ స్టేట్ తమిళనాడు.. గుజరాత్ ను తోసేసి రెండో స్థానానికి ఎగబాకింది. తమిళనాడులో సోమవారం ఒక్కరోజే 536 కొత్త కేసులు రావడంతో సంఖ్య 11,760కి పెరిగింది. అందులో 4,406 మంది కోలుకోగా, 82 మంది చనిపోయారు. గుజరాత్ లో ఇవాళ కొత్తగా 366 కేసులు వచ్చాయి, మొత్తం సంఖ్య 11746గా ఉంది. మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రమైన మహారాష్ట్రలో సోమవారం ఒక్కరోజే 2033 కొత్త కేసులు రావడంతో మొత్తం సంఖ్య 35,086కు పెరిగింది. అత్యధిక మరణాలు(1249) కూడా అక్కడే నమోదయ్యాయి.
ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ(10,054 కేసులు), రాజస్థాన్(5507), మధ్యప్రదేశ్(5236), ఉత్తరప్రదేశ్(4605), వెస్ట్ బెంగాల్(2825) ఉన్నాయి. మొత్తం 2432 కేసులతో ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానంలో కొనసాగుతుండగా, 1592 కేసులతో తెలంగాణ 11వ ప్లేసులో నిలిచింది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా సోమవారం నుంచి దేశవ్యాప్తంగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని దుకాణాలు తెరుచుకున్నాయి, ప్రజా రవాణా వ్యవస్థలు కూడా రీఓపెన్ అయ్యాయి. జాగ్రత్తలు పాటించకుంటే మరింత ప్రమాదకర స్థితి తలెత్తే అవకాశం లేకపోలేదు.