కశ్మీర్ పై మళ్లీ నోరు పారేసుకున్న పాక్ హై కమిషనర్
భారత్ లో పాకిస్తాన్ హై కమిషనర్ గా ఉన్న అబ్దుల్ బాసిత్ కశ్మీర్ పై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: భారత్ లో పాకిస్తాన్ హై కమిషనర్ గా ఉన్న అబ్దుల్ బాసిత్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన 'పాకిస్తాన్ డే' కార్యక్రమంలో మరోసారి కశ్మీర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కశ్మీర్ వేర్పాటు వాదులకు మద్దతు పలికారు. వారు చేస్తున్న పోరాటం స్వాతంత్ర్యం కోసమేనంటూ వారిని గట్టిగా వెనకేసుకొచ్చారు. దేవుడి దయవల్ల వారి పోరాటం త్వరలోనే నెరవేరుతుందని వ్యాఖ్యానించారు.
కశ్మీర్ సమస్యను పరిష్కరించుకునేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందన్నారు. అయితే కశ్మీరీల ఆకాంక్షలను ప్రతిబింబించేలా జమ్ముకశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుక్కోవాల్సిందేనన్నారు.
భారత్ మండిపాటు
పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యలపై భారత్ మండిపడింది. భరతదేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దంటూ భారత విదేశాంగ శాఖ ఆయనకు హితవు పలికింది. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యానాలు చేయడం కన్నా పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదాన్ని రూపుమాపే విషయంపై దృష్టి సారించడం మంచిదని పేర్కొంది.