మాకు 22 సీట్లు వస్తే.. కన్నడిగుడే ప్రధానమంత్రి అవుతారు: మా నాన్న రెడీగా ఉన్నారు:
మండ్య: కర్ణాటకలోని మండ్య లోక్ సభ స్థానంపై ఏర్పడిన పీటముడి ఇప్పట్లో వీడేలా లేదు. ఈ స్థానాన్ని కోల్పోవడానికి కాంగ్రెస్ గానీ, జనతాదళ్ (ఎస్) గానీ సిద్ధంగా లేవు. కర్ణాటకలో అధికారాన్ని పంచుకుంటున్న కాంగ్రెస్-జనతాదళ్ (ఎస్) సంకీర్ణ ప్రభుత్వం మధ్య లోక్ సభ నియోజకవర్గాల సీట్ల సర్దుబాటు విషయంలో విభేదాలు తలెత్తుతున్నాయి. ప్రత్యేకించి-మండ్య స్థానాన్ని ఈ రెండు పార్టీలు కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
గత ఏడాది కన్నుమూసిన కేంద్ర మాజీమంత్రి, ప్రముఖ నటుడు అంబరీష్ భార్య, తెలుగునటి సుమలతను మండ్య నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తుండగా.. తన కుమారుడు, నటుడు నిఖిల్ గౌడకు దీన్ని కేటాయించాలని కుమారస్వామి కృతనిశ్చయంతో ఉన్నారు. ఫలితంగా- మండ్య స్థానాన్ని ఎవరు చేజిక్కించుకుంటారనే అంశంపై స్పష్టత రావట్లేదు.
కాంగ్రెస్ కు ఈ సీటును వదులుకోం:
ఈ పరిస్థితుల్లో కుమారస్వామి గురువారం ఉదయం మండ్య జిల్లాలో పర్యటించారు. సుమారు 5000 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము సుమలత కోసం ఈ స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేమని కుమారస్వామి కుండబద్దలు కొట్టారు. దీనికోసం ఎంతవరకైనా వెళ్తామని తేల్చి చెప్పారు.
కన్నడిగుడే ప్రధాని అవుతారు:
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి 22 లోక్ సభ స్థానాలను కట్టబెట్టాలని ఆయన ప్రజలను కోరారు. 28 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్న కర్ణాటకలో 22 స్థానాలు తమకు దక్కితే.. ప్రధానమంత్రి ఎవరనే విషయాన్ని తామే నిర్ణయిస్తామని కుమారస్వామి స్పష్టం చేశారు. మరోసారి కన్నడిగుడు ప్రధానమంత్రిని చేస్తామని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి పగ్గాలను అందుకోవడానికి తన తండ్రి, మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ సిద్ధంగా ఉన్నారని కుమారస్వామి పరోక్షంగా చెప్పుకొచ్చారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల సందర్భంగా దేశంలో 1996 నాటి రాజకీయ పరిస్థితులు ఉత్పన్నమౌతాయని ఆయన అన్నారు. తన తండ్రి దేవేగౌడ ప్రధానిగా ఉన్న కాలంలో ఎప్పుడూ ఉగ్రవాద దాడులు చోటు చేసుకోలేదని, అలాంటి పరిస్థితే వస్తే, దాన్ని వ్యూహాత్మకంగా తిప్పికొట్టగల సమర్థత ఆయనకు ఉందని చెప్పారు. అంతర్జాతీయ దేశాల్లో పాకిస్తాన్ ను ఏకాకిని చేయగల చాతుర్యం దేవేగౌడకు ఉందని అన్నారు.