జమిలి ఎన్నికలు, నియోజవకర్గాల పునర్విభజన - ముహూర్తం ఫిక్స్..!!
రాజకీయంగా సంచలన నిర్ణయాలు జరగనున్నాయి. కొంత కాలంగా చర్చలో ఉన్న జమిలి ఎన్నికలతో పాటుగా నియోజకవర్గాల పునర్విభజన దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు కేంద్రం కీలక కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జమిలి ఎన్నికల పైన నియమించిన జేపీసీ తమ అభిప్రాయాలను స్పష్టం చేసింది. ఈ ఏడాది అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో... అవి పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ సారి కీలక నిర్ణయాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే దేశ వ్యాప్తంగా లోక్ సభ.. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించే యోచనతో తీసుకొచ్చిన జమిలి ఎన్నికలపై బిల్లును అధికారపక్షం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటు సంయుక్త కమిటీ నివేదికను కూడా ఈ సమావేశాల్లోనే సమర్పించ నున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. జమిలి ఎన్నికల తోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన. దీనికి సంబంధించి బిల్లును కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం. జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి.. ఆమోదం లభిస్తే ఇక దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికల నిర్వహణ పైన కసరత్తు ప్రారంభం కానుంది. ఇప్పటికే లా కమిషన్ సైతం తమ అభిప్రాయం వ్యక్తం చేసింది.

నియోజకవర్గాల పునర్విభజన
దీంతో, జమిలి పైన మరోసారి చర్చ మొదలైంది. 2029 ఎన్నికల నాటిమి జమిలి సాధ్యం కాదనే అభిప్రాయం ఉంది. అయితే, కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు మాత్రం కొత్త చర్చకు అవకాశంగా మారుతున్నాయి. ఇక.. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు ప్రారంభం కానుంది. మరోవైపు, అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధంగా నిర్ణయించే బిల్లు రూపకల్పన జరుగుతోందని, బడ్జెట్ సమావేశాల్లోనే దీనిని ప్రవేశపెడతారని ఆ వర్గాలు తెలిపాయి. సమావేశాల మొదటి రోజే జరగనున్న కేంద్ర క్యాబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పూర్వోదయ పథకం కింద ఏపీకి భారీగా నిధులు కేటాయించే అవకాశం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారాల పైన మంత్రివర్గ భేటీతో పాటుగా ఈ నెల 27న నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం తన ప్రతిపాదనలను ప్రతిపక్షాలకు వివరించనుంది. 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి.












Click it and Unblock the Notifications