జమిలి ఎన్నికలు: 22 రాష్ట్రాల షెడ్యూళ్లు మారే ఛాన్స్? అసెంబ్లీ కాలపరిమితి కట్?
దేశంలో కొంత కాలముగా నలుగుతున్న "ఒకటే దేశం.. ఒకటే ఎన్నికలు" ప్రతిపాదనను రాబోయే 2029 లోక్సభ ఎన్నికల నాటికి కార్యరూపంలోకి తెచ్చేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. పైకి ఇది లోక్సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఓటింగ్ జరిపే సాధారణ ప్రక్రియలా కనిపిస్తున్నా, దీని వెనుక చాలా పెద్ద రాజకీయ, రాజ్యాంగ సమీకరణలు దాగి ఉన్నాయి. దేశమంతటా ఒకేసారి ఓటింగ్ జరపాలంటే అనేక రాష్ట్ర ప్రభుత్వాల ఐదేళ్ల గడువును కుదించాల్సి ఉంటుంది, లేదా ప్రత్యేక నిబంధనలతో సర్దుబాటు చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇదే అమలులోకి వస్తే ఏ ఏ రాష్ట్రాల గడువు ఎలా మారుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం చర్చ జరుగుతున్న 22 ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను పరిశీలిస్తే.. అందులో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికే లోక్సభ ఎన్నికలతో పాటే జరుగుతున్నాయి. కాబట్టి ఈ నాలుగింటికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, మిగిలిన 18 రాష్ట్రాల ఎన్నికల చక్రం లోక్సభతో కలవాలంటే మాత్రం వాటి అసెంబ్లీల గడువును గణనీయంగా మార్చక తప్పదు.

ముందుగా ముగియనున్న 11 రాష్ట్రాల పదవీకాలం
రాబోయే రెండేళ్లలో ఎన్డీఏ పాలనలో ఉన్న 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్నికలకు వెళ్లనున్నాయి. ఒకవేళ ఇక్కడ ఎన్డీఏ మళ్లీ గెలిచి, జాతీయ స్థాయిలో 'వన్ నేషన్-వన్ ఎలక్షన్' ఫ్రేమ్వర్క్ అమల్లోకి వస్తే.. ఈ కొత్త ప్రభుత్వాలు ఐదేళ్లు నిండకుండానే తమ పదవీకాలాన్ని మధ్యలోనే ముగించుకోవాల్సి రావచ్చు. ఒకవేళ ఈ రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుంది. తమ ప్రభుత్వాలను ఐదేళ్ల కంటే ముందే రద్దు చేయడానికి ప్రతిపక్షాలు ఒప్పుకోకపోతే కేంద్రానికి ఇది పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉంది.
కొన్ని రాష్ట్రాలకు 3 ఏళ్ల కోత.. మరికొన్నింటికి 4 ఏళ్లకే ముగింపు?
ఈ కొత్త మార్పుల వల్ల గోవా, గుజరాత్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలు తమ పదవీకాలంలో దాదాపు 3 ఏళ్లను కోల్పోయే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు 5 ఏళ్ల పాలన కోసం ఓటేసినప్పటికీ, జాతీయ ఎన్నికల క్యాలెండర్కు సరిపోయేలా ఈ రాష్ట్రాలు ముందుగానే మళ్లీ ఓటింగ్ ముఖం చూడాల్సి వస్తుంది.
ఇక ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల విషయంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. తుది నిబంధనలను బట్టి ఈ 6 రాష్ట్రాల అసెంబ్లీ పదవీకాలం దాదాపు 4 ఏళ్ల దాకా కోతకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల పరిస్థితేంటి?
కేవలం అధికార పక్ష రాష్ట్రాలే కాకుండా ప్రతిపక్షాలు ఏలుతున్న రాష్ట్రాలకు కూడా ఈ ప్రశ్నలు తప్పవు. పంజాబ్కు 2027లో, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరం, తెలంగాణ రాష్ట్రాలకు 2028లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఒకవేళ ఈ రాష్ట్రాల్లో నిర్ణీత సమయానికే ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వాలు ఏర్పడినా.. 2029 లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి వాటి ఐదేళ్ల గడువులో మెజారిటీ సమయం మిగిలే ఉంటుంది. ఆ అసెంబ్లీలను ముందే రద్దు చేస్తారా లేక ఏదైనా ప్రత్యేక తాత్కాలిక ఏర్పాటు ద్వారా కాలపరిమితిని మారుస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు లేదా ఆప్ పాలనలో ఉన్న రాష్ట్రాలను ఒప్పించకుండా కేవలం ఎన్డీఏ రాష్ట్రాలను సమన్వయం చేయడం వల్ల ఈ జాతీయ లక్ష్యం నెరవేరదు.
'ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం' అన్న కాంగ్రెస్
వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 2029 నాటికి 22 ఎన్డీఏ రాష్ట్రాలు తమ ఎన్నికలను లోక్సభతో కలిపే అవకాశం ఉందన్న వార్తలపై స్పందిస్తూ, ఊహాజనిత విషయాలపై వ్యాఖ్యానించబోమని కాంగ్రెస్ కమ్యూనికేషన్ల బాధ్యుడు జైరామ్ రమేశ్ స్పష్టం చేశారు. అయితే, ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు ,పారదర్శకతకు పూర్తి వ్యతిరేకమని పార్టీ వైఖరిని పునరుద్ఘాటించారు.
2026-2029 మధ్య ఎన్నికల ల్యాండ్స్కేప్ ఎలా ఉండబోతోంది?
- 2026-2028: ప్రస్తుత షెడ్యూల్ ప్రకారమే ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.
- 2027-2028: పలు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరుతాయి. సాధారణ నిబంధనల ప్రకారం ఇవి ఐదేళ్లు పాలించాలి.
- జనవరి 2029: ఒకేసారి ఎన్నికల ప్రణాళిక దృష్ట్యా దాదాపు 18 అసెంబ్లీలు ముందస్తు రద్దును ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
- మిడ్-2029: లోక్సభ ఎన్నికలతో పాటు అత్యధిక రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే దఫాలో భారీ స్థాయిలో ఓటింగ్ నిర్వహించే అవకాశాలు ఉంటాయి.














Click it and Unblock the Notifications