మరోసారి విశ్వబంధుగా భారత్.. ‘ఆపరేషన్ అమిస్టాడ్’తో రంగంలోకి మోదీ
భూకంప విపత్తుతో విలవిలలాడుతున్న వెనిజులాను ఆదుకునేందుకు 'విశ్వబంధు'గా భారత్ మరోసారి తన ఉదారత్వాన్ని చాటుకుంది. శత్రు దేశమైనా, మిత్ర దేశమైనా.. ఆపదలో ఉంటే ప్రాణాలను కాపాడటమే పరమావధిగా భావించే భారతదేశం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో రంగంలోకి దిగి 'ఆపరేషన్ అమిస్టాడ్' (Operation Amistad) ప్రారంభించింది.
ప్రపంచంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా 'మేమున్నామంటూ' ముందుండే భారతదేశం.. భూకంప ధాటికి అతలాకుతలమైన వెనిజులాను ఆదుకోవడానికి యుద్ధప్రాతిపదికన తరలివెళ్లింది. వెనిజులాలో మరణాల సంఖ్య 235కు చేరడం, 4,300 మందికి పైగా గాయపడటంతో అక్కడ అత్యవసర వైద్య సాయం కొరత ఏర్పడింది. ఈ క్లిష్ట సమయంలో వెనిజులా ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు అండగా నిలుస్తూ భారత్ అధికారికంగా 'ఆపరేషన్ అమిస్టాడ్' (స్పానిష్ భాషలో అమిస్టాడ్ అంటే స్నేహం అని అర్థం) ప్రారంభించింది. భారత వైమానిక దళానికి (IAF) చెందిన రెండు భారీ C-17 గ్లోబ్మాస్టర్ రవాణా విమానాలు 35 టన్నుల అత్యవసర సహాయక సాగగ్రితో వెనిజులాకు బయలుదేరినట్లు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.

క్షేత్రస్థాయిలోకి 'ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్'.. 'భీష్మ క్యూబ్స్' ప్రత్యేకత!
భారత్ పంపిన ఈ భారీ సహాయక మిషన్లో కేవలం మందులే కాకుండా, గాయపడిన వందలాది మందికి తక్షణ ఆపరేషన్లు చేయడానికి వీలుగా ఒక పూర్తి స్థాయి ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్ కూడా తరలివెళ్లింది. దీనితో పాటు విపత్తు సమయాల్లో కేవలం కొన్ని నిమిషాల్లోనే అత్యవసర వైద్యం అందించేలా అంతర్జాతీయ ప్రశంసలు పొందిన రెండు అధునాతన 'భీష్మ క్యూబ్స్' (BHISHM Cubes) కూడా ఉన్నాయి. 35 టన్నులకు పైగా బరువున్న ఈ సాయంలో ప్రాణ రక్షక మందులు, సర్జికల్ పరికరాలు, హైటెక్ మెడికల్ టూల్స్ ఉన్నాయి.
మోదీ ట్వీట్.. కృతజ్ఞతలు తెలిపిన వెనిజులా!
గురువారం వెనిజులా భూకంప తీవ్రతపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "భారత ప్రజల తరఫున వెనిజులా ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ కష్టకాలంలో భారత్ మీకు అన్ని విధాలా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది" అని మోదీ భరోసా ఇచ్చారు.
ప్రధాని మోదీ ప్రకటన వెలువడిన వెంటనే.. వెనిజులా తాత్కాలిక ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ స్పందిస్తూ, భారత్ చూపిన మానవత్వానికి, అందించిన నైతిక మద్దతుకు తమ దేశం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అంతర్జాతీయంగా మారిన సీన్.. సూపర్ పవర్ల సహాయ చర్యలు!
వెనిజులాలో ప్రస్తుత పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి కార్లోస్ అల్వరాడో తెలిపిన వివరాల ప్రకారం.. ఆసుపత్రులకు వస్తున్న 4,300 మంది బాధితుల్లో అత్యధికులకు తక్షణమే సర్జికల్ ఆపరేషన్లు చేయాల్సి వస్తోంది. అయితే భారీ విద్యుత్ కోతలు, మౌలిక వసతుల ధ్వంసం వల్ల అక్కడ వైద్యం అందడం గగనమైంది. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ పంపిన ఆర్మీ హాస్పిటల్ అక్కడి వేలాది మంది ప్రాణాలను కాపాడనుంది.
మరోవైపు, అమెరికా కూడా తన సైనిక బలగాలను రంగంలోకి దించింది. అమెరికా సదరన్ కమాండ్ ఆధ్వర్యంలో C-17 గ్లోబ్మాస్టర్, C-130 హెర్క్యులస్ విమానాల ద్వారా భారీ ఎయిర్లిఫ్ట్ ఆపరేషన్ చేపట్టింది. ప్రపంచ అగ్రరాజ్యాలతో పోటీపడుతూ, విపత్తు నిర్వహణలో భారత్ వేగంగా స్పందించిన తీరు అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్టను, 'వసుధైక కుటుంబకం' అనే భారతీయ సంస్కృతిని మరోసారి సగర్వంగా చాటిచెప్పింది.













Click it and Unblock the Notifications