Operation Langda: యోగీ సర్కార్ ఎన్ కౌంటర్ల రికార్డు-కనిపిస్తే కాల్చివేతలే-146 మంది హతం
ఉత్తర్ ప్రదేశ్ లో 2017లో అధికారంలోకి వచ్చే నాటికి నేరస్తులు రెచ్చిపోతున్నారు. హత్యలు, మానభంగాలు, దాడులు, కిడ్నాప్ లు ఇలా ఎక్కడ చూసినా ఇదే పరిస్ధితి. దీంతో సీఎం యోగీకి మంటపుట్టింది. నేరస్తుల్ని ఎక్కడికక్కడ కాల్చి చంపాలని అధికారుల్ని ఆదేశించారు. దీంతో గత నాలుగేళ్లలో 3300 మంది నేరస్తుల్ని యూపీ పోలీసులు కాల్చి పారేశారు. ఇందులో 146 మంది చనిపోయారు. మిగతా వారు గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు మొత్తం 8472 ఎన్ కౌంటర్లలో వీరిని ఏరిపారేశారు. దీంతో ఇప్పుడు అక్కడ నేరాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో కొనసాగుతున్న ఎన్ కౌంటర్లపై సీనియర్ పోలీసులు అధికారులు మాత్రం ఎక్కువగా నోరు మెదపడం లేదు. వీటి కోసం పెద్దగా వ్యూహాలేమీ పన్నడం లేదని తెలిపారు. ఈ ఎన్ కౌంటర్లలో చనిపోయిన వారితో పోలిస్తే గాయాల పాలైన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వీరిలో చాలా మంది వికలాంగులుగా మారిపోయారు. అదే సమయంలో ఈ ఎన్ కౌంటర్లలో 13 మంది పోలీసులు కూడా చనిపోయారు. మరో 1117 మంది గాయపడ్డారు. ఇప్పటివరకూ పోలీసులు 18225 మంది నేరస్తుల్ని అరెస్టు చేశారు.
ఎన్ కౌంటర్లలో యూపీ రికార్డు సృష్టిస్తున్న నేపథ్యంలో అక్కడి పోలీసులు మాత్రం ఈ వ్యవహారంపై స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. ఎన్ కౌంటర్లలో నేరస్తుల్ని హతమార్చడం తమ లక్ష్యం కాదని, అందుకే కాల్పులు జరుపుతున్నట్లు వారు చెప్తున్నారు. నేరస్తుల్ని అరెస్టు చేయడమే తమ లక్ష్యమని యూపీ పోలీసు ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. నేరస్తులు తమపై కాల్పులు జరుపుతుంటే తాము మాత్రం ఎందుకు ఊరుకుంటామని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో నేరస్తులతో పాటు పోలీసులు, ప్రజలు కూడా చనిపోతున్నారని వెల్లడించారు.
ఎన్ కౌంటర్లపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని పోలీసుల్ని ప్రశ్నిస్తే వారు మాత్రం ఇప్పటివరకూ తమను ఏ రాజ్యాంగ సంస్దా తప్పుబట్టలేదని చెప్తున్నారు. ఎన్ కౌంటర్లలో బాధితులుగా మారిన వారు కోర్టుల్ని ఆశ్రయించేందుకు అన్ని హక్కులు ఉన్నాయని, కానీ ఎవరూ తమపై ఫిర్యాదు చేయడం కానీ, చర్యలకు ఆదేశించడం కానీ చేయడం లేదన్నారు. దీంతో పోలీసు ఎన్ కౌంటర్లు రాజ్యాంగబద్ధమే అన్నట్లుగా వారు చెప్తున్నారు. అయితే విపక్షాలు మాత్రం యోగీ సర్కార్ పై విరుచుకుపడుతున్నాయి. మరోవైపు వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధమవుతున్న యోగీ సర్కార్ కు ఈ ఎన్ కౌంటర్లు ఇబ్బందికరంగా మారడంతో ప్రభుత్వం వీటిని తమ గొప్పగా చెప్పుకుంటూ ప్రచారం చేపడుతోంది.