నాగాలాండ్ హత్యలపై పార్లమెంట్ లో రచ్చ-లంచ్ బ్రేక్ తర్వాత అమిత్ షా ప్రకటన
నాగాలాండ్లోని మోన్ జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 16 మంది సాధారణ పౌరులు చనిపోవడం ఇవాళ పార్లమెంట్ ను కుదిపేసింది. ఉదయం జీరో అవర్ లో దీనిపై చర్చకు విపక్ష కాంగ్రెస్ నోటీసులు ఇచ్చింది. అయితే లోక్ సభ, రాజ్యసభలోనూ సభాపతులు దీనిపై చర్చకు అంగీకరించలేదు.
నాగాలాండ్ ఘటనపై ఆ తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలోనూ పలువురు ఎంపీలు ఉభయసభల్లో చర్చకు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అంగీకరించకపోవడంతో చివరికి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. భద్రతా బలగాలు సాధారణ పౌరుల్ని పొట్టనపెట్టుకోవడం, పొరబాటున ఘటన జరిగిందని చెప్పడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. దీంతో కేంద్రం దీనిపై ఓ ప్రకటన చేసేందుకు సిద్ధమైంది. హోంమంత్రి అమిత్ షా దీనిపై ఉభయసభల్లోనూ లంచ్ బ్రేక్ తర్వాత ఓ ప్రకటన చేయబోతున్నారు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటనలు చేశారు.

మరోవైపు నాగాలాండ్ హత్యలపై విచారణ కమిషన్ వేయాలని నాగాలాండ్ కు చెందిన ఎన్డీపీపీ ఎంపీ యప్థామీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇచ్చిందని, కేంద్రం కూడా అంతే మొత్తం పరిహారంగా ప్రకటించాలని ఆయన లోక్ సభలో కోరారు. దీనిపై కేంద్రం తరఫున హోంమంత్రి అమిత్ షా ఇచ్చే ప్రకటనలో క్లారిటీ ఇచ్చే అవకాశముంది.
అటు మరో విపక్షం శివసేన కూడా నాగాలాండ్ లో చనిపోయిన 16 మంది కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఎన్సీపీ ఎంపీ సుప్రియాసూలే అయితే మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. అలాగే విపక్ష సభ్యులంతా కాల్పులకు పాల్పడిన 21 మంది భద్రతా బలగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాల హోంమంత్రి అమిత్ షా దీనిపై ప్రకటన చేస్తారని, అంతవరకూ సభ్యులు శాంతించాలని కోరారు.












Click it and Unblock the Notifications