గోవా, మణిపూర్లలో ఉత్కంఠ: కీలకమైన స్థానిక పార్టీలు, ఇతరులు!
ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. కాగా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఏదో ఒక పార్టీకి స్పస్టమైన మెజార్టీ రాగా, గోవా, మణిపూర్లలో మాత్రం హంగ్ ఏర్పడే పరిస్థితి నెలకొంది. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు పోటా పోటీ అన్నట్లు ఫలితాలు విడుదలవుతున్నాయి.
గోవాలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ 12, కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మహారాష్ట్ర గోమాంతక్ పార్టీ(ఎంజీపీ) 2, గోవా ఫార్వర్డ్ పార్టీ 3, ఎన్సీపీ 3, స్వాతంత్రులు 3 స్థానాల్లో ఆధిక్యం చాటుకున్నారు. దీంతో 40స్థానాలున్న గోవాలో ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ దక్కే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గోవాలో ఇతరుల మద్దతే కీలకంగా మారుతోంది.

ఇది ఇలా ఉంటే.. మణిపూర్లో కూడా ఇతరులే కీలకంగా మారారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 25, బీజేపీ 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాగా, ఇతరులు 9స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 60స్థానాలున్న మణిపూర్లో కూడా మేజిక్ ఫిగర్ ఏ పార్టీకి రాకపోవడంతో ఇతరులే కీలకంగా మారారు.
ఈ రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ అయిన అధికారం చేపట్టాలంటే ఇతరుల మద్దతు తీసుకోక తప్పదు. అయితే, ఇతరులు ఏ పార్టీకి మొగ్గుచూపుతారనేది ఉత్కంఠగా మారింది. కాగా, గోవాలో ఇతరు తమ పార్టీ అభ్యర్థులేనని కాంగ్రెస్ ప్రకటించుకోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications