మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి అస్వస్థత.. ఎయిమ్స్కు తరలింపు..?
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహర్ జైలులో ఉన్న మాజీ కేంద్రమంత్రి పి చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పితో బాధపడుతున్నారని జైలు అధికారులు తెలిపారు. దీంతో ఆయనను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు తరలించాలని వైద్యులు సూచించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసుకొని తిరిగి తీహార్ జైలుకు తీసుకొస్తామని అధికారులు పేర్కొన్నారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. చిదంబరం కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు అవకతవకలు జరిగాయని సీబీఐ, ఈడీ అభియోగాలు మోపాయి. ముందస్తు బెయిల్ కోసం చిదంబరం ప్రయత్నించారు. ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో.. సుప్రీంకోర్టు మెట్లెక్కారు. కానీ విచారణను వాయిదా వేయడంతో ఆగస్ట్ 21న చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
ఐఎన్ఎక్స్ మీడియాలో నగదు గురించి ప్రశ్నించారు. దాదాపు నాలుగు పర్యాయాలు కస్టడీకి తీసుకొని విచారించారు. తర్వాత ఈడీ కూడా తమను కస్టడీకి ఇవ్వాలని కోరింది. దీంతో చిదంబరాన్ని తీహర్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. జైలులో తనకు ప్రత్యేక వసతులు కల్పించాలని చిదంబరం కోరినా.. కోర్టు తిరస్కరించింది. ఇంటి భోజనం తీసుకొచ్చేందుకు మాత్రం అంగీకరించింది. తనకు బెయిల్ ఇవ్వాలని ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని తిరస్కరించిన సంగతి తెలిసిందే.