అటారీ-వాఘా బోర్డర్ మూసివేత! బంగ్లాతో కలిసి పాక్ కుట్రలు
జమ్మూకాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశంలోని పాకిస్థాన్ జాతీయులు స్వదేశానికి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం వివిధ వీసాదారులకు విధించిన గడువు ఏప్రిల్ 30తో ముగిసింది. ఈ క్రమంలోనే వాఘా-అటారీ సరిహద్దును తాజాగా పూర్తిగా మూసివేసినట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
అయితే, అంతకుముందు ఈ గడువును ప్రభుత్వం సవరించిందనే వార్తలు వచ్చినప్పటికీ.. దానిపై స్పష్టత రాలేదు. అటారీ-వాఘా సరిహద్దు ప్రస్తుతం పూర్తిగా మూసివేశారు. ఇరుదేశాల ప్రజలు రాకపోకలు సాగించే వీలులేదు అని సంబంధిత వర్గాలు స్పష్టం చేయడం గమనార్హం. భారతదేశంలోని 125 మంది పాకిస్థానీలు బుధవారం స్వదేశానికి వెళ్లిపోయారు. దీంతో గడిచిన ఏడు రోజుల్లో భారత్ ను వీడిని పాకిస్థానీల సంఖ్య 911కి చేరినట్లు తెలిసింది. మరోవైపు, పాకిస్థాన్లో ఉన్న 15 మంది భారతీయులు సరిహద్దు దాటి స్వదేశానికి చేరుకున్నట్లు సమాచారం.

భయాందోళనలో పాక్.. యుద్ద సన్నాహాలు
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యలతో పాకిస్థాన్ భయాందోళనలకు గురవుతోంది. భారత్ సైనిక చర్యకు దిగుతుందోననే భయంతో పీవోకే, గిల్గిత్ ప్రాంతాలకు ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ నుంచి వెళ్లే విమానాలను రద్దు చేసుకుంది. మరోవైపు, భద్రతా కారణాలను చూపుతూ పాక్ విమానయాన అధికారులు.. మే 1 నుంచి మే 31 వరకు కరాచీ, లాహోర్ ఎయిర్ స్పేస్ లను పాక్షికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
భారత్ యుద్ధానికి దిగుతుందని భావిస్తున్న పాక్ ముందుగానే అప్రమత్తమైంది. పాక్ సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టంను మోహరించింది. రాజస్థాన్ సరిహద్దులో ఎయిర్ డిఫెన్స్ తోపాటు అర్టిలరీ యూనిట్ ను ఏర్పాటు చేసింది. భారత వైమానిక దాడులను గుర్తించడానికి పాక్ సైన్యం తన రాడార్ వ్యవస్థల్ని సియాల్ కోట్ సెక్టార్ కు తరలించింది.
బంగ్లాదేశ్లో పాక్ అధికారుల మకాం.. భారత్ వ్యతిరేకంగా కుట్రలు
ఉగ్రదాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన పాకిస్థాన్కు గట్టి జవాబిచ్చేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఈ సమయంలో పాకిస్థాన్ మరిన్ని కుట్రలకు తెరలేపుతోంది. బంగ్లాదేశ్ సాయంతో భారత సరిహద్దులో అలజడి సృష్టించేందుకు పాక్ కుయుక్తులు పన్నుతోంది. ఇప్పటికే బంగ్లాదేశ్లో పలువురు పాక్ అధికారులు మకాం వేసినట్లు తెలిసింది. ఈ మేరకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో భారత్ హైఅలర్ట్ ప్రకటించింది. రాడికల్ గ్రూపులను పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ యాక్టివ్ చేసినట్లు తెలుస్తోంది. మనదేశంలో రాడికల్ గ్రూపులను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు పన్నుతోంది. బంగ్లా సరిహద్దులోని రాష్ట్రాల్లో అలజడులు సృష్టించేందుకు పాక్ దుష్టపన్నాగం వేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications