లక్నోలో దిగిన పాకిస్థాన్ విమానం: స్వీట్లు పంచిన భారత జవాన్లు
లక్నో/శ్రీనగర్: పాకిస్థాన్కు చెందిన ఓ విమానం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో విమానాశ్రయంలో దిగడం సంచలనం సృష్టించింది. అయితే ఇంధనం నింపుకునేందుకు ఆ విమానం దిగినట్లు సమాచారం. ఆ విమానం పాకిస్థాన్లోని రావల్పిండి నుంచి వచ్చినట్లుగా తెలిసింది.
ఇంధనం నింపుకునేందుకే ఆ విమానం లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ విమానాశ్రయంలో లాండ్ అయిందని, ఇందుకు ఇండియన్ ఎయిర్ఫోర్స్ అనుమతిచ్చిందని భారత అధికారులు తెలిపారు. ఆ విమానం పాకిస్థాన్ రక్షణ దళానికి చెందినదని, అందులో ఐదుగురు పాక్ జవాన్లు ఉన్నారని చెప్పారు. ఆ విమానం బంగ్లాదేశ్కు వెళుతుందని చెప్పారు.
వాఘా సరిహద్దులో రిపబ్లిక్ డే: పాక్ దళాలకు స్వీట్లు
భారత్-పాకిస్థాన్ల మధ్య వాఘా సరిహద్దులో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇరుదేశాల సైనికులు పలు విన్యాసాలు ప్రదర్శించారు. జాతీయ పతాక అవనత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఇది ఇలా ఉండగా నియంత్రణ రేఖ వెంబడి భారత జవాన్లు గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పలు ప్రాంతాల్లో సరిహద్దుకు ఆవల ఉన్న పాక్ దళాలకు స్వీట్లు పంచారు. పాక్ నుంచి చొరబాట్లు, కాల్పుల విరమణ ఉల్లంఘన ఉన్నప్పటికీ భారత దళాలు చొరవ తీసుకుని స్వీట్లు ఇవ్వడంపై పాక్ దళాలు కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, భారత్లో అమెరికా అధ్యక్షుడు ఒబామా మూడు రోజుల పర్యటనపై పాకిస్థాన్ మీడియా విస్తృతంగా కవర్ చేస్తోంది. భారత్-అమెరికా అణు ఒప్పందానికి ఈ కథనాల్లో అధిక ప్రాధాన్యతనిస్తోంది.