భాషా పండితులతో పాక్ ఐఎస్ఐ శిక్షణ
బరేలి: పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ భారత్ లో అరాచకాలు జరిపే తమ వారికి భాషా పండితుల దగ్గర శిక్షణ ఇప్పిస్తున్నదని విచారణలో వెలుగు చూసింది. ఇటీవల అరెస్టు అయిన ఐఎస్ఐ గూఢచారి మహమ్మద్ ఇజాజ్ ఈ విషయం వెల్లడించాడు.
భారత్ లో తమ కార్యకలాపాలు నిర్వహించడానికి వెళ్లే వారికి భాషా పండితుల దగ్గర శిక్షణ ఇప్పిస్తున్నదని, అందు కోసం భాషా పండితులను ఐఎస్ఐ రిక్రూట్ చేసుకుంటుందని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సీనియర్ అధికారి అజయ్ పాల్ సింగ్ వెల్లడించారు.
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఇజాజ్ కు ఉత్తరప్రదేశ్ లోని పశ్చిమ ప్రాంతానికి చెందిన స్థానిక యాసలో మాట్లాడేలా శిక్షణ ఇచ్చారని అధికారులు తెలిపారు. మొదట తనను రిక్రూట్ చేసుకున్న తరువాత పాక్ లోని పంజాబీ యాసలో మాట్లాడటం చూసి ఐఎస్ఐ ఆందోళన చెందిందని చెప్పాడు.

తరువాత భాషా పండితుల దగ్గర తనకు పూర్తి శిక్షణ ఇప్పించి నమ్మకం కుదిరిన తరువాత భారత్ పంపించారని మహమ్మద్ ఇజాజ్ చెప్పాడని సీనియర్ అధికారి అజయ్ పాల్ సింగ్ వివరించారు.
భారత్ వచ్చిన తరువాత మరో సారి భాషా పండితులతో తనకు శిక్షణ ఇప్పించారని ఇజాజ్ అంగీకరించాడు. ఐఎస్ఐ శిక్షణలో కంప్యూటర్, వీడియో గ్రఫీ, భారత సంప్రదాయాల గురించి పూర్తి అవగాహన కల్పించారని ఇజాజ్ అంగీకరించాడు.
ఐఎస్ఐ గూఢచారి మహమ్మద్ ఇజాజ్ కు ఉర్దూ, పంజాబీ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం ఉందని సీనియర్ పోలీసు అధికారి అజయ్ పాల్ సింగ్ స్పష్టం చేశారు. ఇజాజ్ ను విచారణ చేసి మరన్ని వివరాలు బయటకు లాగాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications