యుద్ధానికి దిగిన పాక్- భారత్పై మిస్సైళ్లతో దాడి: ధర్మశాల ఐపీఎల్ మ్యాచ్ రద్దు
Missile attack on India: జమ్మూ కాశ్మీర్పై పాకిస్తాన్ భారీ ఎత్తున దాడికి పాల్పడుతోంది. తొలుత డ్రోన్లతో దాడి చేసింది. ఆ తరువాత మోర్టార్ షెల్స్తో విరుచుకుపడుతోంది. జనావాసాలపై షెల్స్ సంధిస్తోంది. సరిహద్దు గ్రామాలు, భారత ఆర్మీ పోస్టులు లక్ష్యంగా కాల్పులకు తెగబడుతోంది.
ప్రత్యేకించి- జమ్మూలో పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ భూభాగంపై నుంచి పదుల సంఖ్యలో డ్రోన్లు జమ్మూ వైపు దూసుకుని రావడం కనిపించింది. డ్రోన్లతో దాడికి దిగింది పాకిస్తాన్ ఆర్మీ. ఉధంపూర్, జమ్మూ, అఖ్నూర్, పఠాన్కోట్ వైపు దూసుకొచ్చాయి అవి. యుద్ధంలో వినియోగించే స్వార్న్ డ్రోన్లను పాకిస్తాన్ ఆర్మీ ప్రయోగించినట్లు భారత సైనిక వర్గాలు ప్రాథమికంగా నిర్ధారించాయి.

డ్రోన్లు భారత్ వైపు దూసుకుని రావడం మొదలుపెట్టిన కొన్ని క్షణాల వ్యవధిలోనే జమ్మూ కాశ్మీర్ అంతటా సైరన్ మోతలు మోగించింది భారత ఆర్మీ. సాధారణ పౌరులకు ముందస్తు హెచ్చరికలను జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఉండకూడదనడానికి సూచికగా సైరన్ మోతలు మోగించింది.
వరుసబెట్టి వస్తోన్న డ్రోన్లను భారత ఆర్మీ ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. వాటితో ఇంటర్సెప్ట్ అయింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూల్చివేస్తోంది. అదే సమయంలో బ్లాక్ అవుట్ను కూడా నిర్వహించింది. చీకటి ఆవరించిన జమ్మూ కాశ్మీర్ గగనతలంపై డ్రోన్లు దూసుకుని వచ్చే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆ తరువాత కొద్దిసేపటికే నియంత్రణ రేఖ వెంబడి గల సరిహద్దు గ్రామాలు, భారత ఆర్మీ పోస్టులపై విరుచుకుపడుతోంది. మిస్సైళ్లను సంధించింది. సత్వారి, సాంబ, ఆర్ఎస్ పురా, ఆర్నియా సెక్టార్లల్లో మిస్సైళ్లను సంధించింది. వీటిని భారత ఆర్మీ మధ్యలోనే నేల కూల్చివేసింది.
అదే సమయంలో కుప్వారా, బారాముల్లా జిల్లాల్లో కాల్పుల మోత మోగుతోంది. పాకిస్తాన్ భూభాగంపై నుంచి మోర్టార్ షెల్స్ రివ్వుమంటూ దూసుకొస్తోన్నాయి. జనావాసాలపై పడుతోన్నాయి. ఇప్పటివరకు ఎంత మేర నష్టం సంభవించిందనేది ఇంకా తెలియరావట్లేదు.
ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి చోటు చేసుకున్న మరుసటి రోజు నుంచి క్రమం తప్పకుండా పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తోంది. ప్రతి రోజూ అర్ధరాత్రి వేళ- భారత ఆర్మీ పోస్టులపై తేలికపాటి ఆయుధాలతో కాల్పులు జరుపుతూ వచ్చింది.
బుధవారం రాత్రి దీని తీవ్రతను పెంచింది. మోర్టార్ షెల్స్, ఆర్టిల్లరీ గన్స్తో సరిహద్దు గ్రామాలపై కాల్పులు జరిపింది పాక్ సైన్యం. ఈ దాడుల్లో 13 మంది సాధారణ పౌరులు మరణించారు. 44 మంది తీవ్రంగా గాయపడ్డారు. పూంచ్లోని కృష్ణ ఘాటి, షాపూర్, మన్కోఠ్, జమ్మూ సెక్టార్ రాజౌరి జిల్లాలోని లామ్, మన్జా కోఠ్, కాశ్మీర్ సెక్టార్ కుప్వారా జిల్లాలోని కర్నా, యూరి, తంగ్ధర్, బారాముల్లా వంటి జిల్లాల సరిహద్దు గ్రామాల నివాసితులపై భారీ షెల్లింగ్ దాడులు సాగించింది పాకిస్తాన్ ఆర్మీ.
ఇప్పుడు దీన్ని తీవ్రతరం చేసింది. కుప్వారా, బారాముల్లా జిల్లాల్లో కాల్పుల మోత మోగుతోంది. పాకిస్తాన్ భూభాగంపై నుంచి మోర్టార్ షెల్స్ రివ్వుమంటూ దూసుకొస్తోన్నాయి. జనావాసాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు సాగిస్తోంది. భారత సైన్యం దీన్ని సమర్థవంతంగా తిప్పి కొడుతోంది.
దీని తీవ్రతను దృష్టిలో పెట్టుకుని హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయింది. ఢిల్లీ కేపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఇది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ 10.1 ఓవర్లల్లో ఒక వికెట్ నష్టానికి 122 పరుగులు చేసిన సమయంలో మ్యాచ్ నిలిపిపోయింది.
తొలుత బ్యాడ్ లైట్ వల్ల మ్యాచ్ ఆగిపోయినట్లు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత స్టేడియం మొత్తాన్ని కూడా ఖాళీ చేయాలంటూ హిమాచల్ ప్రదేశ్ క్రికెట అసోసియేషన్ ప్రతినిధులు ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. ఆ కొద్దిసేపటికే మ్యాచ్ రద్దయినట్లు ప్రకటించారు. అప్పటికే జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పులు మొదలయ్యాయి కూడా.












Click it and Unblock the Notifications