పాక్ కవ్వింపు చర్యలు: మోర్టార్ షెల్స్తో సరిహద్దు గ్రామాలపై దాడి
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు నిర్వహించి 72 గంటలు అయిందో లేదో గానీ పాకిస్థాన్ కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా శనివారం మళ్లీ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లుతున్నాయి. ఉదయం 4.00 గంటల నుంచి బుల్లెట్ల వర్షం కురిపించింది. అఖ్నూర్ సెక్టార్ వద్ద గ్రామాలపై పాక్ బలగాలు మోర్టార్ షెల్స్తో దాడులకు పాల్పడ్డాయి. పాక్ చర్యలకు భారత భద్రతా దళాలు కూడా ధీటుగా సమాధానమిస్తున్నాయి.
ముందస్తు చర్యల్లో భాగంగా సరిహద్దు గ్రామాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు. పంజాబ్లో 10 కిలో మీటర్ల మేర ప్రజలను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖాళీ చేయించింది. సరిహద్దు వద్ద చోటు చేసుకుంటున్న పరిణామాలపై, ఆయా ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై రాజ్నాథ్ సింగ్ సమీక్షిస్తున్నారు.
మొత్తం వెయ్యి గ్రామల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది. ఆయా ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తోన్న భారత సైనికులు అక్కడి పాఠశాలలు, కళాశాలల్లో సైనిక శిబిరాల ఏర్పాటు చేసుకుంటున్నారు. పంజాబ్లో గురుద్వారలోనూ సైనికుల శిబిరాలు ఏర్పాటయ్యాయి. ప్రజలంతా తట్టా బుట్టూ సర్దుకుని గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు.
ఈ కాల్పుల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్కు ఆర్మీ ఛీప్ దల్బీర్ సింగ్ శనివారం బయల్దేరారు. వెస్ట్రన్ కమాండ్తో అత్యవసర రివ్యూ చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతంలోని భద్రతా వ్యవహారాలను ఆయన సమీక్షిస్తారు.
పీఓకేలోకి చొచ్చుకుపోయి పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడిన అనంతరం జమ్మూకశ్మీర్లో భారత ఆర్మీ చీఫ్ తొలి పర్యటన ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఉధంపూర్లోని ఉత్తర కమాండ్ హెడ్ క్వార్టర్స్లో జరిగే సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సైన్యం సమీక్షిస్తోంది.