పాక్ అరాచకాలు మన కాశ్మీరీలకు తెలీదు: పారికర్
న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ సరిద్దుల్లో, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నివసిస్తున్న ప్రజల్ని పాకిస్థాన్ సైనికులు దారుణంగా హింసిస్తున్నారని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ దుయ్యబట్టారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో పాకిస్థాన్ జరుపుతున్న అరాచకాల గురించి మన దేశంలోని కాశ్మీరీ సోదరులకు తెలియదన్నారు.
ఆదివారం రాత్రి పనాజీలో జరిగిన ఓ కార్యక్రమంలో పారికర్ మాట్లాడుతూ.. పీఓకేలో పాక్ సైన్యం అరాచకాలకు అంతులేకండా పోతోందన్నారు. ఈ ప్రాంత ప్రజల్ని హింస పెడుతున్న పాక్ సైన్యం అకృత్యాల గురించి మన దేశంలోని కాశ్మీరీ సోదరులకు తెలియజేయాల్సిన అవసరముందన్నారు.
ఈ విషయాలు తెలిస్తే కాశ్మీరీలు పాకిస్తాన్ని తల్చుకోవడానికి సైతం భయపడతారని పారికర్ పేర్కొన్నారు. పాకిస్థాన్లోని ప్రముఖ నగరం పెషావర్లో సైనిక స్థావరానికి కూతవేటు దూరంలోనే వందలాదిమంది విద్యార్థులు దారుణాతి దారుణంగా హత్యకు గురయ్యారని, ప్రార్థనల కోసం మసీదులకు వెళుతున్నవారు సైతం ప్రాణాలతో తిరిగిరావడం లేదని రక్షణమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్న పాకిస్తాన్ ప్రధాన భూభాగంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఒకనాడు పాక్ సైన్యం ఆక్రమించగా నేడు ఉగ్రవాదులకు భూతల స్వర్గంగా మారిన పీఓకేలో పరిస్థితి ఏంటన్నది ప్రత్యేకించి కాశ్మీరీలకు తెలియాల్సిన అవసరముందన్నారు.
భారత్కు వ్యతిరేకంగా విద్వేష ప్రచారం చెయ్యడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న ఆయన, సరిహద్దుల గుండా మన దేశంలోకి ఉగ్రవాదులను పంపేందుకు పాక్ సైన్యం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతుండటం చూస్తూనే ఉన్నామని పారికర్ తెలిపారు.