మెజారిటీ పళనిస్వామికే.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి: పీఆర్ సరస్వతి
అన్నాడీఎంకె శాసనసభాపక్ష నేత పళనిస్వామికే మెజారిటీ ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆయనకు ఆహ్వానం పంపించాలని సరస్వతి డిమాండ్ చేశారు.
చెన్నై: తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని అన్నాడీఎంకె శాసనసభాపక్ష నేత పళనిస్వామి గవర్నర్ కు విన్నవించినా.. ఆయన మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సుబ్రహ్మణ్య స్వామి లాంటి బీజేపీ సీనియర్ నేతలు సైతం గవర్నర్ తీరుపై మండిపడుతుండగా.. తాజాగా అన్నాడీఎంకె అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి దీనిపై స్పందించారు.
అన్నాడీఎంకె శాసనసభాపక్ష నేత పళనిస్వామికే మెజారిటీ ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆయనకు ఆహ్వానం పంపించాలని సరస్వతి డిమాండ్ చేశారు. అన్నాడీఎంకె రాజకీయాలను చీల్చడానికి విపక్షాలు చేసిన కుట్ర సాగదని అన్నారు. త్వరలోనే అన్ని సద్దుమణుగుతాయని చెప్పారు.
కాగా, మంగళవారం సాయంత్రం అన్నాడీఎంకె శాసనసభాపక్ష నేత పళనిస్వామి గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను ఆయన విద్యాసాగర్ రావుకు అందజేశారు. మరోవైపు సుప్రీం తీర్పుతో శశికళ కూడా బెంగుళూరు పరప్పణ కోర్టులో లొంగిపోవడానికి బయలుదేరడంతో ఇక గవర్నర్ నిర్ణయమే మిగిలి ఉంది.