పన్నీర్ సెల్వం 'జీరో', మాకు పోటీ ఏంటి?: ఆర్కేనగర్ 'బై పోల్'పై దినకరన్
ఉపఎన్నిక బరిలో తమ పార్టీకి పన్నీర్ సెల్వం పోటీ కాదని, ఎన్నికల్లో ఆయన సున్నా అని దినకరన్ విమర్శించారు.
చెన్నై: శశికళతో వార్ లో పైచేయి సాధించలేక చతికిలపడిపోయిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం.. పార్టీ బయటి నుంచే అమ్మకు తానే అసలైన వారసున్ని అని చాటుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం జయ మృతి విషయాన్ని లేవనెత్తుతూ.. దానిపై విచారణ జరిపించాల్సిందిగా ఆయన ఒక్కరోజు దీక్ష కూడా చేశారు.
ఇదే క్రమంలో జయ మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఏప్రిల్ 12న ఎన్నిక నిర్వహించబోతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన వెలువడింది. దీంతో ఆర్కేనగర్ బరిలో ఇటు పన్నీర్ సెల్వంతో పాటు, అటు కొత్త పార్టీ పెట్టిన దీప బరిలోకి దిగే అవకాశాలున్నాయి.
మరోవైపు అన్నాడీఎంకె నుంచి ఎవరు బరిలో దిగుతారన్నది ఇంకా తేలనప్పటికీ.. ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవి దినకరన్ ఆర్కేనగర్ ఉపఎన్నికపై స్పందించారు. ఉపఎన్నిక బరిలో తమ పార్టీకి పన్నీర్ సెల్వం పోటీ కాదని, ఎన్నికల్లో ఆయన సున్నా అని దినకరన్ విమర్శించారు. తమ ప్రధాన పోటీదారు ప్రతిపక్షం డీఎంకెనే అని స్పష్టం చేశారు.
టీటీవీ దినకరన్ పన్నీర్ సెల్వంను 'జీరో'అని వ్యాఖ్యానించినప్పటికీ.. ప్రజల్లో పన్నీర్ కు ఉన్న మద్దతు, సానుభూతి విస్మరించరానిది. అదే సమయంలో జయలలిత పోలికలతో ఉన్న ఆమె మేనకోడలు దీప పట్ల కూడా ప్రజలు ఒకింత పాజిటివ్ గానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆర్కేనగర్ లో విజయఢంకా మోగించేదెవరో అన్నదానిపై ఇప్పటినుంచే తీవ్ర ఆసక్తి నెలకొంది.