రైతుల భూములు రైతులకే: తేల్చి చెప్పిన సీఎం విజయ్: పల్లెల్లో పండుగ వాతావరణం
కొంతకాలంగా వివాదాస్పదంగా మారిన ప్రతిపాదిత పరందూర్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ విషయంలో విజయ్ తుది నిర్ణయం తీసుకున్నారు. పరందూర్లో నూతన విమానాశ్రయం నిర్మించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తోన్నామని తేల్చి చెప్పారు. ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తే వందల హెక్టార్లల్లో పంట నష్టపోవాల్సి ఉంటుందని, స్థానికులను ఖాళీ చేయించి, వారికి ఇబ్బందులకు గురిచేసే ఎలాంటి అభివృద్ధి ప్రాజెక్టులను ప్రోత్సహించబోమని స్పష్టం చేశారు.
చెన్నై సమీపంలో నూతన విమానాశ్రయం నిర్మాణానికి వ్యవసాయేతర ప్రాంతాలను పరిశీలిస్తున్నామని, ఇందుకోసం ఇప్పటికే కొన్ని ప్రదేశాలను కూడా ప్రాథమికంగా గుర్తించామని విజయ్ వివరించారు. చెన్నై మీనంబాక్కం ఎయిర్ పోర్ట్ లో కొత్తగా అయిదో టెర్మినల్ నిర్మాణానికి త్వరలో చర్యలు చేపడతామని అన్నారు. దీనివల్ల రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండబోవనీ, వారి భూములు వారికే చెందుతాయని అన్నారు.

పరందూర్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయంపై స్థానికులు, ఆందోళన కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తోన్నారు. ప్రాజెక్ట్ ఏర్పాటుకు సంబంధించిన పనులను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను పరందూర్ గ్రీన్ ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులు సచివాలయంలో కలిశారు. ఆయనను సన్మానించారు. కృతజ్ఞతలు తెలిపారు.
విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంతో పరందూర్ పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ నిర్ణయంతో పరందూర్, దాని చుట్టుపక్కల నివసిస్తున్న వేలాది మంది రైతులు, స్థానిక ప్రజల ఏళ్ల నాటి భయాందోళనలు తొలగిపోయాయని ఆందోళన కమిటీ పేర్కొంది. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి, వారి సాగు భూములు, జీవనోపాధిని కాపాడినందుకు విజయ్ ను కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
చెన్నైలోని సచివాలయంలో పరందూర్ గ్రీన్ ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు జీ సుబ్రమణియన్, కార్యదర్శి ఎస్ డీ కతిరేశన్తో పాటు పలువురు ప్రతినిధులు విజయ్ తో సమావేశం అయ్యారు. విమానాశ్రయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తాము సాగించిన ప్రజాస్వామ్యయుత సుదీర్ఘ పోరాటానికి ఈ ప్రభుత్వ నిర్ణయంతో సరైన న్యాయం చేకూరిందని కమిటీ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.
అనంతరం సుబ్రమణియన్ విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్ ను రద్దు చేయాలంటూ తాము గత డీఎంకే ప్రభుత్వాన్ని పలుమార్లు విజ్ఞప్తి చేశామని, ఏ రోజు పట్టించుకోలేదని విమర్శించారు. పరందూర్, దాని పరిసర ప్రాంతాల్లో డీఎంకే నేతలు కోట్ల రూపాయల విలువ చేసే భూములను కొనుగోలు చేశారని ఆరోపించారు. రైతుల సంక్షేమం కంటే కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పని చేశారని మండిపడ్డారు. ఈ ఎయిర్ పోర్ట్ ను రద్దు చేయడంతో విజయ్ తమకు పూర్తి న్యాయం చేశారని, తమ ఆందోళనలన్నింటినీ కూడా ఉపసంహరించుకుంటోన్నామని అన్నారు.















Click it and Unblock the Notifications