శశికళ కలకలం: అది జైలు కాదు బార్, సీఎం ఇచ్చిన వరం, మాజీ ఉప ముఖ్యమంత్రి ఫైర్!
బెంగళూరు: నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు ఒకప్పుడు కారాగారం అని, కానీ ఇప్పుడు అది బార్ (మద్యం దుకాణం) అయ్యిందని కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ శాసన సభ్యుడు ఆర్. అశోక్ వ్యంగంగా అన్నారు.
శనివారం ఆయన బెంగళూరులోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రజల కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో ఆదేవుడికే తెలియాలని వ్యంగంగా అన్నారు. అయితే పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోని ఖైదీలకు అనేక సౌకర్యాలు కల్పించారని, అనేక వరాలు ఇచ్చి రికార్డు సృష్టించారాని విమర్శించారు.
అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ దగ్గర రూ. 2 కోట్లు లంచం తీసుకున్న అధికారులు ఆమెకు వీవీఐపీ సౌకర్యాలు కల్పించారని మాత్రమే డీజీపీ రూప నివేదిక ఇచ్చారని, ఆమె ఎలాంటి నేరం చెయ్యలేదని మాజీ డిప్యూటీ సీఎం అశోక్ లేడీ ఐపీఎస్ అధికారిని వెనకేసుకొచ్చారు.
మీకు చేతనైన నిస్పక్షపాతంగా విచారణ జరిపించి నేరం చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, అంతే కాని అధికారంలో ఉన్నాం కదా అంటూ డీఐజీ రూపకు నోటీసులు ఇవ్వడం సరికాదని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆర్. అశోక్ మండిపడ్డారు.