పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఫిక్స్: మోడీ సర్కార్కు సవాళ్లు ఇవే
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం కుదిరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ నాయకత్వాన్ని వహిస్తోన్న ప్రతిపక్ష యూపీఏ- తమ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదివరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే ముందే అర్ధాంతరంగా ముగించిన పరిస్థితుల్లో.. అందరి దృష్టీ తాజా సెషన్స్ మీదే ఉన్నాయి. మరోసారి అలాంటి సన్నివేశాలను చూడాల్సి వస్తుందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి.
Recommended Video

నవంబర్ 29 నుంచి..
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 29వ తేదీన ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 23వ తేదీ వరకు కొనసాగుతాయి. యావత్ దేశాన్ని పెను ప్రకంపనలకు గురి చేసిన ఇజ్రాయెల్ స్పై సాఫ్ట్వేర్ పెగాసస్ హ్యాకింగ్ కుంభకోణం, దాని తరువాత చోటు చేసుకున్న పరిణామాలు- వర్షాకాల సమావేశాలను అట్టుడికించిన విషయం తెలిసిందే. పెగాసస్ హ్యాకింగ్ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలంటూ కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి.

పెగాసస్పైనే..
దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా సహా కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎవరూ పెదవి విప్పలేదు. ఈ హ్యాకింగ్ కుంభకోణంపై బదులు ఇవ్వాలంటూ పార్లమెంట్ ఉభయ సభలను కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు స్తంభింపజేశాయి. సభా కార్యకలాపాలేవీ ముందుకు సాగలేదు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో తమ ఆందోళనలను మరింత ఉధృతం చేశాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని- నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ముగించాల్సి వచ్చింది.

భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై..
ఇప్పుడు మళ్లీ అవే తరహా పరిస్థితులు తలెత్తడానికి అవకాశాలు లేకపోలేదు. పెగాసస్ స్పైవేర్ కుంభకోణంపై బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును వెల్లడించనుంది. ఈ తీర్పు వెలువడిన తరువాత అధికార పార్టీ గానీ, ప్రతిపక్షాలు గానీ- తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై ఓ నిర్ణయానికి వస్తాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ఇంకా నెలరోజులకు పైగా సమయం ఉన్నందున- ఎన్డీఏ, యూపీఏ వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకోవడానికి గడువు లభించినట్టయింది.

ఇంధన ధరల పెరుగుదల మీదా..
దీనితోపాటు- ఇంధన ధరల గురించి కూడా ప్రతిపక్షాలు.. కేంద్ర ప్రభత్వ పెద్దలను ఇరకాటంలో పడేయడానికి అవకాశం ఉంది. రోజురోజుకూ అడ్డు అదుపు లేకుండా పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలు.. సామాన్యుల నడ్డి విరగ్గొడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. డీజిల్ వంద రూపాయలను దాటేసింది అనేక నగరాల్లో. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ 120 రూపాయలకు చేరువ అవుతోంది. జేబులో వంద రూపాయలు లేనిదే లీటర్ పెట్రోల్ కూడా లభించని దయనీయ పరిస్థితి ఏర్పడింది.

నిధుల బకాయిల గురించి..
దీనిపైనా ప్రతిపక్షాలు.. అధికార పార్టీని నిలదీసే అవకాశం ఉంది. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై ఉభయ సభల్లో తన గళాన్ని వినిపించడం ఖాయంగా కనిపిస్తోంది. తిరుగుబాటు లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజుపై వేటు వేయడం, పోలవరం ప్రాజెక్టు నిధుల బకాయిల చెల్లింపు గురించి లోక్సభ, రాజ్యసభల్లో ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా.. విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలు గురించి మరోసారి తన గళాన్ని వినిపించే ప్రయత్నం చేస్తుందని వైసీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications