విమాన ప్రయాణికుడి లంచ్లో బల్లి: రాజు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణీకుడికి ఇచ్చిన భోజనంలో బల్లి పిల్ల వచ్చిందన్న విషయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు శనివారం నాడు తీవ్రంగా స్పందించారు. ఇది చాలా సీరియస్ విషయమని, భోజనంలో బల్లి వస్తే అది సరికాదని ఆయన అభిప్రాయపడ్డాడు.
కాగా, ఎయిర్ ఇండియా విమానంలోని ఒక ప్రయామీకుడికి అందించిన ఆహార పళ్లెంలో బల్లి ఉన్న ఫోటో సామాజిక అనుసంధాన మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ - లండన్ ఎయిర్ ఇండియా విమానంలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది.
అయితే, ఈ ఘటనను నిరాధార ఆరోపణగా ఎయిర్ ఇండియా కొట్టి పారేసింది. దీని పైన దర్యాఫ్తు నిర్వహించామని చెప్పింది. విమానంలో గానీ, లండన్లోని తమ కార్యాలయంలో గానీ దీనికి సంబందించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపింది.
ఢిల్లీ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఏఐ 111లో ఈ సంఘటన జరిగిందని భావిస్తున్నారు. విమానం బయలుదేరాక, మధ్యాహ్నం 1 గంటలకు ప్రయాణీకులకు భోజనం పెట్టారు. ఓ ప్రయాణీకుడికి బల్లి పిల్ల వచ్చిందని తెలుస్తోంది.
అతను కేబిన్ క్రూకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారు అతనికి భోజనం మార్చినట్లు తెలుస్తోంది. అయితే, దానిని సదరు ప్రయాణీకుడు తిరస్కరించాడని తెలుస్తోంది. దీనిపై సదరు ప్రయాణీకుడు ఫిర్యాదు చేశాడని చెబుతున్నారు. కానీ ఎయిర్ ఇండియా దానిని కొట్టి పారేస్తోంది.