కరోనా లక్షణాలుంటే హోం ఐసోలేషన్ తప్పనిసరి: మార్గదర్శకాలు విడుదల
న్యూఢిల్లీ: తేలికపాటి కరోనావైరస్ లక్షణాలతో బాధపడుతున్న రోగులు తమ ఇంటి వద్దనే ఐసోలేషన్ ఉండేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ పలు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. వైద్యాధికారులు ఐసోలేషన్లో ఉండే వ్యక్తులకు అవసరమైన సూచనలు, వైద్యపరమైన సహాయాన్ని వైద్యాధికారులు అందజేస్తారని తెలిపింది.
కరోనా లక్షణాలున్న వ్యక్తులు.. ఇంట్లోని ఇతర కుటుంబసభ్యులతో కలవకుండా ఒంటరిగానే ఉండాలని స్పష్టం చేసింది. అంతేగాక, కరోనా రోగి తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా నిఘా అధికారికి తెలియజేయాలని, వారే వచ్చి వివరాలు సేకరిస్తారని పేర్కొంది.
మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో కరోనా రోగులు హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులను తీసుకునేందుకు అనుమతిచ్చింది. అంతేగాక, ఆరోగ్యసేతు యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఎప్పటికప్పుడు పరిస్థితిని అప్ డేట్ చేయాలి, అందులో పొందుపర్చిన సూచనలు పాటించాలి. ఎప్పుడూ యాక్టివ్గానే ఉంచాలి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి నొప్పి, మానసిక ఆందోళన, ముఖం రంగులో మార్పు రావడం లాంటి పరిణామాలు చోటు చేసుకుంటే వెంటనే వైద్యం అందిస్తున్న వైద్యాధికారిని ఆలస్యం చేయకుండా సంప్రదించాలి.
సంబంధిత వైద్యాధికారి కరోనా లక్షాణాలు లేవని, పూర్తిగా కోలుకున్నారని నిర్ధారించిన తర్వాతే ఐసోలేషన్లో ఉన్న ఆ వ్యక్తి కరోనా నుంచి బయటపడినట్లు అని స్పష్టం చేసింది. అతని నమూనాలను సేకరించి పరీక్షించిన తర్వాత నెగెటివ్ అని తేలితే అతడు ఐసోలేషన్ నుంచి బయటపడినట్లే. కరోనా సోకిన వ్యక్తుల నుంచి ఆస్పత్రుల్లో ఇతరులకు సోకకుండా ఈ చర్యలను తీసుకుంటున్నారు.