దృశ్యం సినిమా: అదే రైంజ్లో హత్య, సాక్ష్యాలు మాయం
పాట్నా: బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటించిన దృశ్యం సినిమా చూసి ఆ సినిమాలో సాక్ష్యాలు ఎలా నాశనం చేశారో అదే విధంగా చెయ్యాలని ప్రయత్నించాడు ఓ వ్యక్తి. అయితే పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చెయ్యడంతో అతను హత్య చేసినట్లు వెలుగు చూసింది.
పోలీసుల కథనం మేరకు పాట్నాలోని వైశాలి ప్రాంతానికి చెందిన రజనీష్ సింగ్ అనే వ్యక్తిని వారం క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సృష్టి జైన్ అనే మహిళ హత్య కేసులో రజనీష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో పోలీసులు దిమ్మతిరిగిపోయే నిజాలు వెలుగు చూశాయి. పోలీసులకు అచ్చం దృశ్యం సినిమా చూపించాడు. వివాహం చేసుకుంటానని నమ్మించి సృష్టి జైన్ ను పాట్నాకు పిలిపించాడు. తరువాత ఆమెను రివాల్వర్ తో దారుణంగా కాల్చి చంపాడు.
పోలీసులు తన మొబైల్ ట్రేస్ చేస్తారని భావించిన రజనీష్ దానిని ఓ ట్రక్ లోకి విసిరి వేశాడు. ట్రక్ లో పడిన మొబైల్ పగిలిపోయిందని పోలీసులు అన్నారు. తరువాత రూ. 500 ఇచ్చి ఓ బోట్ ను మాట్లాడుకుని గంగా నదిలోకి వెళ్లాడు. గంగా నదిలో అతని బైక్ విసిరివేశాడని పోలీసు అధికారులు చెప్పారు.
రజనీష్ కు గతంలో వివాహం అయ్యింది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఓ మ్యాట్రీమోనీ సైట్ ద్వారా సృష్టి జైన్ ను పరిచయం చేసుకున్నాడు. వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెను పాట్నాకు రప్పించి హత్య చేశాడని పోలీసు అధికారులు తెలిపారు.