బిజెపి నేతలతో పవన్ భేటీపై నిర్మల, కాంగ్రెస్పై వెంకయ్య
న్యూఢిల్లీ/హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పొత్తుల విషయమై భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ గురువారం స్పందించారు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు తమ పార్టీ నేతలను కలువలేదని చెప్పారు. పొత్తులపై పార్టీ చూసుకంటుందని చెప్పారు. పొత్తుల విషయమై చర్చలు జరగలేదన్నారు.
తమ పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ సహా బిజెపి నేతల లోకసభ సీటు వ్యవహారం పార్టీ చూసుకుంటుందని తెలిపారు. సీట్ల వ్యవహారం తమ ఇంటి సమస్య అన్నారు. కొందరు బిజెపి నేతలకు బెదిరింపులు వస్తున్నాయని, భద్రత కోసం హోంమంత్రిని కలిసినట్లు చెప్పారు.

సమస్యలకు కాంగ్రెసు కారణం: వెంకయ్య
దేశంలోని సమస్యలు అన్నింటికి కాంగ్రెసు పార్టీయే కారణమని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు వేరుగా అన్నారు. దేశాన్ని ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెసు పార్టీయే అన్నారు. స్వాతంత్రానంతరం మతకలహాలు, ఇతర సమస్యన్నింటికి కాంగ్రెసు పార్టీయే కారణమని చెప్పారు.
ఎన్డీయే హయాంలో వేసిన రోడ్లలో మూడో వంతు కూడా యూపిఏ ప్రభుత్వం వేయలేదని మండిపడ్డారు. దమ్ముంటే రోడ్ల నిర్మాణం పైన కేంద్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ హయాంలోని రోడ్ల నిర్మాణం, యూపిఏ హయాంలోని రోడ్ల నిర్మాణంపై చర్చకు తాము సిద్ధమన్నారు.
బిజెపి మద్దతుతోనే తెలంగాణ కల సాకారమైందని చెప్పారు. పొత్తుల విషయం ప్రకాశ్ జవదేకర్, అరుణ్ జైట్లీలు చూసుకుంటారని తెలిపారు. 1998 నాటి కంటే ఇప్పుడు బిజెపి హవా పెరిగిందన్నారు. దానికి అనుగుణంగానే తమకు సీట్లు కేటాయించాలని వెంకయ్య చెప్పారు. తాను ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయడం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications