నిర్భయ నిందితులను ఉరితీసేది ఇతనే..! ఇంతకీ ఇతనెవరు..?
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఉరిశిక్ష పడ్డ నిందితులను ఉరి తీసేందుకు తీహార జైలు అధికారులు పవన్ జల్లాద్ అనే తలారిని ఎంపిక చేశారు. మూడు రోజుల క్రితమే ఆయన తీహార్ జైలుకు చేరుకున్నాడు. ఉరితీసే ఉరికంభాన్ని ఇతర ఏర్పాట్లను పవన్ పరిశీలించాడు. ఇదిలా ఉంటే మార్చి 20న నిర్భయ నిందితులను ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు కొద్ది రోజుల క్రితం తీర్పును వెలువరించింది. ఇక పవన్ జల్లాద్ అనే తలారీని నిర్భయ నిందితులను ఉరితీసేందుకు పంపాలని కోరుతూ తీహార్ జైలు అధికారులు ఉత్తర్ ప్రదేశ్ జైల్ డైరెక్టొరేట్ను కోరారు.
నిర్భయ నిందితులను ఉరి తీసేందుకు పవన్ జల్లాద్ వైపే తీహార్ జైలు అధికారులు ఎందుకు మొగ్గు చూపారో అనేదానికి కొన్ని కారణాలను వివరిస్తున్నారు. ఇందులో మొదటిగా తన తండ్రి తాతలు కూడా నిందితులకు కోర్టులు విధించిన ఉరిశిక్షను అమలు చేయగా.. పవన్ జల్లాద్ కూడా ఆ కుటుంబం నుంచి వచ్చినందునే అతని వైపు మొగ్గు చూపినట్లు తీహార్ జైలు అధికారులు తెలిపారు. అంతేకాదు అదే వృత్తిలో ఉన్నాడు కాబట్టి పొరపాట్లు జరగవని చెబుతున్నారు. ఇక ఉరితీసే తలారి శారీరకంగా మానసికంగా ధృడంగా ఉండటంతో పాటు కనుచూపు కూడా బాగుండాలనే నిబంధనలు ఉన్నాయి. పవన్ శారీరకంగాను, మానసికంగాను బలంగా ఉండటంతో పాటుగా కనుచూపు కూడా బాగుందని జైలు అధికారులు తెలిపారు.
ఇక పవన్ జల్లాద్కు ఇచ్చిన సెక్యూరిటీని కూడా రహస్యంగా ఉంచుతామన్నారు అధికారులు. ఢిల్లీ కోర్టు ఉరిశిక్షను అమలు చేస్తూ ఇచ్చిన ఆర్డర్ కాపీలను నిందితులకు అందజేశామని అయితే డెత్ వారెంట్ మాత్రం జైలు పాలనా విభాగం వద్ద ఉంటుందని స్పష్టం చేశారు జైళ్ల శాఖ డీజీ సందీప్ గోయల్. ఇక పవన్ కూడా తన డ్యూటీని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తీహార్ జైలు అధికారులు తెలిపారు. కొన్ని నెలలుగా ఇలాంటి ఒక అవకాశం కోసం చూస్తున్నట్లు పవన్ జల్లాద్ చెప్పాడు. భగవంతుడే నిర్భయ నిందితులను ఉరితీసే అవకాశం తనకు ఇచ్చినట్లు చెప్పాడు.
Recommended Video
కాన్షీరాం ఆవాస్ యోజన కింద మీరట్లో తనకు ప్రభుత్వం కేటాయించిన ఓ ఇంట్లో పవన్ ఉంటున్నాడు. మీరట్లోని తలారీ కుటుంబం నుంచి వచ్చిన నాలుగో తరంకు చెందిన వ్యక్తి పవన్. నిర్భయ కేసులో నిందితులైన ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ సింగ్, పవన్ గుప్తాలను మార్చి 20 తేదీన ఉదయం 5:30 గంటలకు ఉరి తీయాల్సిందిగా ఢిల్లీ కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. 2012లో డిసెంబర్ 16న ఢిల్లీలో 23 ఏళ్ల నిర్భయపై కదులుతున్న బస్సులో ఈ నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిర్భయ కన్నుమూసింది. మొత్తం ఆరుగురు సామూహిక అత్యాచారం చేయగా ఇందులో ప్రధాన నిందితుడు రాంసింగ్ జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరొకరు మైనర్గా ఉండటంతో మూడేళ్లు జువైనైల్ జైలులో శిక్ష అనుభవించి విడుదలయ్యాడు.