సీఎం పీఠంపై బీజేపీ కన్ను.. కాదంటే, తేల్చుకోలేకపోతున్న ముఫ్తీ
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు అంశం రసవత్తరంగా మారింది. ప్రభుత్వం ఏర్పాటుకు పీడీపీ వేచి చూస్తుండగా, మరోవైపు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పీఠం పైన కన్నేసినట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ మినహా ఏ పార్టీతోనైనా పొత్తుకు బీజేపీ సిద్ధంగా ఉంది.
పీడీపీకీ 28, బీజేపీకి 25, కాంగ్రెస్కు 12, నేషనల్ కాన్ఫరెన్స్కు 15 స్థానాలు వచ్చాయి. ఇతరులు ఏడు స్థానాల్లో గెలుపొందారు. ఈ నేపథ్యంలో మరో ఏడుగురు తమకు మద్దతు పలుకుతున్నారని, అప్పుడు మొత్తం 32 సీట్లు తమవే అవుతాయని, తమకే ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది.
సందిగ్ధంలో ముఫ్తీ
పీడీపీ అధినేత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధంలో ఉన్నారు. పూర్తి మెజార్టీ రానందున ఎవరి మద్దతు తీసుకోవాలనే విషయమై సమాలోచనలు చేస్తున్నారు. బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్.. ఇలా అన్ని పార్టీలు మద్దతిచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే, బీజేపీ మద్దతు తీసుకుంటే ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాల్సిన అవసరం రావొచ్చు.
పీడీపీ నేత ముజఫర్ బేగ్ మాట్లాడుతూ.. బీజేపీని తాము రాజకీయ అంటరాని పార్టీగా భావించడం లేదని చెప్పారు. 370 ఆర్టికల్ పైన చర్చ జరగాలన్న బీజేపీ వాదనతో తాము ఏకీభవిస్తామని చెప్పారు. మరోవైపు, పీడీపీ అధికార ప్రతినిధి నయీమ్ అక్తర్ మాట్లాడుతూ.. ఎవరి మద్దతు తీసుకోవాలనే విషయమై తమ పార్టీ అధినేత్రి మాట్లాడుతారని చెప్పారు. ముఫ్తీ మాత్రం ఆచితూచి అడుగులేస్తున్నారు.
బీజేపీ జార్ఖండ్లో కింగ్గా అవతరించింది. జమ్మూ కాశ్మీర్లో కింగ్ కాకున్నా... కింగ్ మేకర్ అవుదామని భావిస్తోంది. అందులో భాగంగానే మొదట ముఖ్యమంత్రి పీఠం కోసం పట్టుబడుతోందని, అది కుదరకుంటే పీడీపీకి మద్దతివ్వవచ్చునని చెబుతున్నారు. బీజేపీ ఇరు రాష్ట్రాలకు పరిశీలకులను పంపించనున్నారు. జమ్మూ కాశ్మీర్కు అరుణ్ సింగ్, అరుణ్ జైట్లీ, జార్ఖండ్కు జేపీ నడ్డా, సహస్త్ర బుద్దే వినయ్ను పంపించనున్నారు.