కరోనా మొదటి వేవ్ తర్వాత ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఇప్పుడైనా పాఠాలు నేర్వాలి... ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలన కామెంట్స్
ఆర్ఎస్ఎస్(రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) చీఫ్ మోహన్ భగవత్ కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా మొదటి వేవ్ తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. కరోనా కట్టడిలో మోదీ సర్కార్ వైఫల్యం చెందిందని ప్రతిపక్షాలు,అంతర్జాతీయ మీడియా విమర్శిస్తున్న వేళ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆ విమర్శలకు బలం చేకూర్చేలా వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్గా మారింది. కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు 'పాజిటివిటీ అన్లిమిటెడ్' పేరిట ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసిన వర్చువల్ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడారు.
మోహన్ భగవత్ ఏమన్నారు...
దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై మోహన్ భగవత్ మాట్లాడుతూ...'ఇప్పుడు మనం ఈ దుస్థితిని ఎదుర్కోవడానికి కారణం... కరోనా మొదటి వేవ్ తర్వాత అటు ప్రభుత్వం,అధికార యంత్రాంగం లేదా ప్రజలు... అందరూ తమ బాధ్యత మరిచారు... ఓవైపు రెండో వేవ్ సంకేతాలు ఉన్నప్పటికీ,వైద్యులు సూచనలు చేస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు.' అని వ్యాఖ్యానించారు. 'థర్డ్ వేవ్ కూడా రావొచ్చునని చెబుతున్నారు.. కాబట్టి మనం భయపడుదామా లేక సరైన ధోరణితో కరోనాపై పోరాడుదామా...' అని మోహన్ భగవత్ ప్రశ్నించారు.
కనీసం ఇప్పుడైనా పాఠాలు నేర్చుకుందామని...
కనీసం ఇప్పటి అనుభవాల నుంచైనా ప్రభుత్వం,ప్రజలు పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని మోహన్ భగవత్ పేర్కొన్నారు. ఇప్పుడు చేస్తున్న తప్పుల నుంచి భారతీయులు పాఠాలు నేర్చుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ టేబుల్పై ఉండే ఒక కొటేషన్ను భగవత్ గుర్తుచేశారు. 'నిరాశవాదానికి ఇక్కడ తావు లేదు... ఓటమిని చవిచూడాలన్న ఆసక్తి ఎంతమాత్రం లేదు...ఆ రెండు ఇక్కడ అసలు ఉనికిలోనే లేవు...' అని ఆ కొటేషన్ను ప్రస్తావించారు.
Recommended Video
కరోనాపై విజయం సాధించాలి : భగవత్
కరోనా మహమ్మారిపై భారతీయులు విజయం సాధించాల్సిన అవసరం ఉందని భగవత్ పేర్కొన్నారు. 'జీవన్మరణాలు కొనసాగుతూనే ఉంటాయి... అవి మనల్ని భయపెట్టలేవు... ఇలాంటి పరిస్థితులే మనల్ని భవిష్యత్తుకు సంసిద్దులను చేస్తాయి. విజయమే అంతిమం కాదు. ఓటమి మరణం కాదు. కావాల్సింది పోరాటాన్ని కొనసాగించే ధైర్యాన్ని కలిగి ఉండటం..' అని స్పష్టం చేశారు. మే 11 నుంచి ఐదు రోజుల పాటు ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 'పాజిటివిటీ అన్లిమిటెడ్' కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వర్చువల్గా జరుగుతున్న ఈ కార్యక్రమంలో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ,ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ తదితరులు పాల్గొంటున్నారు.