మోదీ-షా జోడీకి బిగ్ షాక్: థ్యాంక్స్ చెప్పిన ఖర్గే
Byelection result 2024: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే వస్తోన్నాయి. అలాంటి ఇలాంటి దెబ్బలు కాదు. హైఓల్టేజ్ షాక్ కొడుతోందా పార్టీకి. లోక్సభ ఎన్నికల్లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేని దుస్థితికి దిగజారింది బీజేపీ. ఎన్డీఏ సంకీర్ణ కూటమి భాగస్వామ్య పక్షాల మద్దతుతో బొటాబొటి మెజారిటీతో ఏలుతోంది.
ఆ ఓటమి అనేది ఇంకా వీడలేదు. వెంటాడుతూనే వస్తోంది. దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో ఖాళీ అయిన 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీకి ఘోర పరాజయాలే ఎదురయ్యాయి. 13 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది రెండే. 10 చోట్ల ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. మరో చోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.

దేవభూమిగా పేరున్న ఉత్తరాఖండ్లోని బద్రినాథ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోయింది. ఆ పార్టీకి ఇక్కడ వరుసగా రెండో ఓటమి. అలాగే- మంగ్లౌర్ ఉప ఎన్నికలో కూడా పరాజయం పాలైంది. అధికారంలో ఉన్నప్పటికీ ఈ రెండు నియోజకవర్గాల్లో గెలవలేకపోయింది కాషాయపార్టీ. ఈ రెండు చోట్లా కాంగ్రెస్ అభ్యర్థులు విజయదుందుభి మోగించారు.
బద్రినాథ్, మంగ్లౌర్ - ఉత్తరాఖండ్, నాలాగఢ్, దెహ్రా- హిమాచల్ ప్రదేశ్లల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. పశ్చిమ బెంగాల్లోని రాయ్గంజ్, రాణాఘాట్ దక్షిణం, బాగ్డా, మాణిక్తాలాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. తమిళనాడులో విక్రవాండిలో డీఎంకే, పంజాబ్లోని జలంధర్ వెస్ట్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది.
హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్, మధ్యప్రదేశ్లోని అమర్వారా అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. బిహార్లోని రుపౌలీలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయదుందుభి మోగించారు.
ఇండియా కూటమి మెజారిటీ స్థానాలను గెలుచుకోవడం పట్ల కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఈ ఎన్నికలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అహంకార, మోసపూరిత, అనైతిక, విశ్వసనీయత లేని రాజకీయాలకు ఓ చెంపదెబ్బగా అభివర్ణించారు. ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికి శ్రమించిన ప్రతి కార్యకర్తకూ ఆయన ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications